13 జిల్లాల సభ కాదు: సమైక్యాంధ్ర సభపై అశోక్ బాబు
హైదరాబాద్: తాము ఈ నెల 7న హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన సమైక్యాంధ్ర సభ 13 జిల్లాల సభ కాదని, రాష్ట్రంలోని 23 జిల్లాల నుండి సమైక్యవాదులు, ప్రతినిధులు వస్తారని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సోమవారం అన్నారు. సభను తాము ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు.
సమైక్యాంధ్ర సభకు ప్రభుత్వం అనుమతివ్వాలని లేదంటే తాము హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటామన్నారు. సభ ప్రశాంతంగా, క్రమశిక్షణతో నిర్వహిస్తామని తాము హామీ ఇస్తున్నామన్నారు. ఈ సభ ఎవరినీ కించపర్చేందుకు కాదని స్పష్టం చేశారు.

ఇంటికొకరు చొప్పున హైదరాబాదుకు రావాలని, ఈ నెల 6న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సమైక్యవాదం ఎంత బలంగా ఉందో తెలిపేందుకే ఈ సభను నిర్వహిస్తున్నామన్నారు. చిన్న చిన్న సంఘటనలు జరిగితే పెద్దవిగా చూపవద్దని ఆయన కోరారు.
సమైక్యతను కోరుకునే ప్రతి ఒక్కరు, ప్రతి జిల్లా నుండి రావొచ్చన్నారు. రాజకీయ నాయకులు సభకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదన్నారు. 50 సంఘాలు సభకు సహకరించేందుకు ముందుకు వచ్చాయన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే తాము ఉద్యమిస్తున్నామన్నారు. రాజకీయాలతో తమకు సంబంధం లేదని, రాజకీయంగా తాము తటస్థులమని చెప్పారు.












Click it and Unblock the Notifications