అంతకంటే మంచిగా తిట్టొచ్చు, సుష్మ నవ్వు: శివప్రసాద్

టిడిపి ఎంపీలు ఇందిరా గాంధీ మాస్కుతో లోకసభ సమావేశాలకు వచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీనిపై శివ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ బతికి ఉండి ఉంటే ఆమె దగ్గరకే వెళ్లి నిలదీసేవాడిని అన్నారు. లోక్సభలో తాను ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ ఎంపీలు బుద్ధిహీనతను, చవటత్వాన్ని చాటుకున్నారని విమర్శించారు.
సమైక్యాంధ్రకు గతంలో ఇందిరా గాంధీ మద్దతు తెలిపిన కారణంగా.. ప్రస్తుతం ఆమె కోడలు సమైక్యాంధ్రను విభజిస్తున్న నేపథ్యంలో ఇందిర మాస్కుతో సోనియాను కలవాలని ప్రయత్నించానని చెప్పారు. ఆ మాస్కుతో తాను వేరీజ్ మై డాటర్ ఇన్ లా అంటే.. హియరీజ్ హర్ అంటూ బిజెపి సభ్యురాలు సుష్మా స్వరాజ్ నవ్వుతూ జవాబిచ్చారన్నారు.
రాష్ట్ర సమైక్యత కోసం పోరాడుతున్న మాకు వస్తున్న మద్దతును చూసి ఉక్రోషం పట్టలేక మధుయాష్కీ మమ్మల్ని తిట్టాడని, సందీప్ దీక్షిత్, మధుయాష్కీ మమ్మల్ని బండ బూతులు తిట్టారని, బయటకు రా.. చంపేస్తాం అన్నారని, ఏం చేస్తారో చూద్దాం రండి అని తాము అనడంతో కనిపించకుండా పారిపోయారన్నారు.
తానొక దళిత ఎంపీని అని, నన్ను బెదిరించాల్సిన అవసరం ఏముందన్నారు. ఢిల్లీలో మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే రక్షించలేని సిఎం కొడుకు పార్లమెంట్లో దళితులపై దాడి చేయడం హేయమన్నారు. అత్యున్నత చట్టసభలోనే దళితుడిని దూషిస్తే దేశంలో పేద బలహీన వర్గాల పరిస్థితి ఏమిటన్నారు.
రాష్ట్ర విభజనను పూర్తి వితండంగా, చాదస్తంగా చేస్తామంటే చేసుకోండని, అయితే మాకేం చేస్తారు? అని తాము అడుగుతున్నామన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం, పౌరుషం ఉన్న తాము నలుగురమే అయినా నెల రోజులుగా పార్లమెంటును అడ్డుకున్నామని గుర్తు చేశారు. పార్లమెంటులో అలా ప్రవర్తించడం ద్వారా కాంగ్రెసు మరోసారి తెలుగు ప్రజలను అవమానించిందన్నారు.












Click it and Unblock the Notifications