రాయపాటి చొరవ: 22న సమైక్యాంధ్ర రాష్ట్ర సమితి?

గుంటూరుకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఇటీవల పదేపదే సరికొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోందంటూ బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ నెల ఆరో తేదీన ఆయన లోకసభ సభ్యత్వానికి పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే దారిలో సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేల రాజీనామాలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణలోని టిఆర్ఎస్ తరహాలో సమైక్యాంధ్ర రాష్ట్ర సమితి (ఎస్ఆర్ఎస్) పేరిట రాజకీయ పార్టీ స్థాపనకు చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే రహస్యంగా కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట రిజిస్ట్రేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఎనెగ్జరీరీ ఫారం-1ను నిర్ణీత డిపాజిట్ సొమ్ముతో అందజేశారు. ప్రస్తుతానికి ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ సంకె విశ్వనాథం పేరిట ఢిల్లీలో ఈ వ్యవహారమంతా అంతా నడుస్తోంది. పార్టీ ఏర్పాటుకు రాయపాటి సాంబశివ రావు చొరవ ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.
కొన్ని నెలల క్రితం వరకు విజయవాడ పార్లమెంటు సబ్యుడు లగడపాటి రాజగోపాల్ శిబిరంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే ఆరుగురు ఎన్నారైలు, సీమాంధ్రకు చెందిన పలువురు ప్రముఖులే కాకుండా హైదరాబాద్కు చెందిన పలు రంగాల ప్రముఖులు సైతం ఆ పార్టీ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. 22న ఢిల్లీలో ఈ పార్టీ ఆవిర్భవించబోతోందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications