షర్మిలకు ఆస్తులపైనే: పొన్నం, లోకేష్ పందికొక్కు: గుత్తా
హైదరాబాద్/ న్యూఢిల్లీ: కేవలం హైదరాబాదులో ఉన్న ఆస్తుల గురించే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల ప్రశ్నిస్తున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి రోజున ఆయన ఫొటో లేకుండానే షర్మిల సభ నిర్వహించారని పొన్నం ప్రభాకర్ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు
షర్మిల రాజకీయ అజ్ఝానంతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలపై విషమం చిమ్ముతున్నారని, తెలంగాణలో ఉన్న వేలాది మంది సీమాంధ్ర ప్రజల గురించి మాట్లాడబోరని ఆయన అన్నారు. తెలంగాణ నిర్ణయాన్ని ఆపగలమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అపోహలు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
హైదరాబాదులో ఉండేవారికి ఎవరికీ ఎలాంటి హానీ జరగదని ఆయన అన్నారు. హైదరాబాద్ తెలంగాణ నడిబొడ్డున ఉందని చెప్పారు. అందువల్ల హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తామంటే తాము అంగీకరించేది లేదని పొన్నం ప్రభాకర్ అన్నారు.
తమ పార్టీ నేత రాహుల్ గాంధీని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముద్దపప్పుగా అభివర్ణించడంపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పందికొక్కా అని ఆయన అడిగారు.
లోకసభలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు బూతు పురాణాన్ని అబ్బించుకున్నారని, తెలుగుజాతి గౌరవాన్ని దిగజార్చారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగుదేశం పార్లమెంటు సభ్యుల తీరుపై ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపిలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.