మీ గోల బయటపడుతుందనే, మేం పొగిడాం: ఉండవల్లి

తాను ఇందిరా గాంధీ ప్రసంగాన్నే చదివి వినిపిస్తున్నానని, తన ప్రాంతంలో ప్రజలు చేస్తున్న ఉద్యమం గురించి సభలో మాట్లాడే హక్కు తనకు లేదా? అని ప్రశ్నించారు. వాస్తవానికి తన ప్రసంగాన్ని ఎవ్వరూ అడ్డుకోరని, తన ప్రసంగంలో ఎవరినీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవని తాను ముందే స్పీకర్కు చెప్పానన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ప్రాంత ఎంపీలు ఎప్పుడు మాట్లాడినా సీమాంధ్ర ఎంపీలు ఏనాడూ వారిని అడ్డుకోలేదని గుర్తుచేశారు.
పైపెచ్చు తెలంగాణపై సర్వే సత్యనారాయణ సభలో మాట్లాడినప్పుడు బాగా మాట్లాడావంటూ తాను అభినందించానని, అలాంటిది ఇప్పుడు తాను మాట్లాడుతుంటే తెలంగాణ ఎంపీలు ఎందుకు తన గొంతు నొక్కారని ప్రశ్నించారు. అన్నదమ్ముల్లా విడిపోదాం, సామరస్యంగా కలిసి ఉందామని అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. తాను గొంతు విప్పితే తెలంగాణ ఎంపీల గోల ఎక్కడ బయటపడుతుందోననే వారు భయపడ్డారని చెప్పారు.
తెలంగాణ ఉద్యమం గురించి, దాని తీవ్రత గురించి, వారి మనోభావాల గురించి ఎన్నో రోజులు పార్లమెంటులో మాట్లాడారని, అయితే తొలిసారి తాను సమైక్యాంధ్ర గురించి మాట్లాడాలని ప్రారంభించగానే గొడవకు దిగారని ఉండవల్లి మండిపడ్డారు. సమైక్యాంధ్ర వాయిస్ దేశానికి వినబడితే తెలంగాణ నాయిస్కు అడ్డుపడుతుందని, కాబట్టే గోల చేశారన్నారు. తన గొంతు నొక్కానని తెలంగాణ వారు భావించవచ్చని.. అయితే ఇది ఎంత పెద్ద ఉపద్రవానికి దారి తీస్తుందో రాబోయే రోజుల్లో తెలుస్తుందని అన్నారు.
తెలంగాణ బిల్లు ఇంకా అయిపోలేదని, అసెంబ్లీలో, పార్లమెంటులో చర్చ జరుగుతుందని, పార్లమెంటులో ఓటింగ్ జరుగుతుందని, రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందని గుర్తుచేశారు. ఏకాభిప్రాయం సాధించకుండా ఇవన్నీ జరగడం అసాధ్యమని స్పష్టం చేశారు. తనను అడ్డుకోవడం ఎంత నష్టమో తెలుస్తుందన్నారు. సీమాంధ్ర నుంచి ఎవరినీ పార్లమెంటులో మాట్లాడనివ్వకుండా చేస్తామనే రీతిలో తెలంగాణ ఎంపీలు వ్యవహరించటం వల్ల తీవ్రపరిణామాలు సంభవిస్తాయన్నారు.
కాగా, ఉండవల్లి ప్రసంగిస్తుండగా తాము అడ్డుకోలేదని.. వాస్తవాలను తెలిపామని.. టి ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు. కేవలం ఇందిరా గాంధీ ప్రసంగం చెబితే సరిపోదని, నెహ్రూ, సోనియా గాంధీ ప్రసంగాలు కూడా చెప్పాలని తాము డిమాండ్ చేశామన్నారు.












Click it and Unblock the Notifications