శాంతికాముకులం కాబట్టే సభ: డిఎస్, పోలీస్ దాడిపై..

D Srinivas
హైదరాబాద్: తెలంగాణ బిడ్డలు శాంతికాముకులని అందుకే, ఎపిఎన్జీవో సభలో ఎక్కువ మాట్లాడినా సంయమనం పాటించారనిపిసిసి మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి శ్రీనివాస్ శనివారం అన్నారు. తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ఉండి సంయమనం పాటించినందు వల్లే హైదరాబాదులో ఎపిఎన్జీవోలు సభ ప్రశాంతంగా నిర్వహించుకున్నారన్నారు. నిజాం కళాశాలలో పోలీసుల తీరు శోచనీయమన్నారు.

వసతి గృహం నుంచి విద్యార్థులు బయటకు వస్తుంటే... పోలీసులు అక్కడికి వెళ్లి ఎందుకు కొట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఎపిఎన్జీవోల సభ వద్ద ఓ కానిస్టేబుల్ తనలో ఉన్న ఆవేశాన్ని తట్టుకోలేక జై తెలంగాణ అని నివాదం చేస్తే.. అతనిని చిరునవ్వుతో పక్కకు పంపాల్సింది పోయి దాడి చేయడం సరికాదన్నారు. పోలీసుల దౌర్జన్యంపై పూర్తిస్థాయిలో విచారణ చేసి చర్యలు చేపట్టాలన్నారు.

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగుతున్న తరుణంలో రాష్ట్రాన్ని విభజిస్తే హైదరాబాదులో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని సభలో కొంతమంది హెచ్చరించడం సరైన పద్ధతి కాదన్నారు. హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణను కేంద్రం ప్రకటించిందని, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసే ప్రసక్తి లేదని చెప్పారు. రెండు రాష్ట్రాలు ఏర్పడినా ప్రేమాభిమానాలతో ఉండాలన్నారు.

నిజాం కళాశాల ఉన్నందున ముందుగానే విద్యార్థులను ఇంటికి పంపించినా, అరెస్టు చేసినా సరిపోయేదని, విద్యార్థులపై లాఠీచార్జి చేయడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. విద్యార్థులపై అకారణంగా లాఠీచార్జి చేసిన పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిజాం కాలేజీ హాస్టల్‌లోకి పోలీసులు చొరబడి విద్యార్థులపై లాఠీచార్జి చేయడం దారుణమని రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి డికె అరుణ మండిపడ్డారు. విద్యార్థులతో పాటు తెలంగాణవాదులపై పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎపిఎన్జీవోల సభ సందర్భంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు వివక్షతో వ్యవహరించారని నిప్పులు చెరిగారు.

నిజాం కళాశాల విద్యార్ధులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. పోలీసు కానిస్టేబుళ్ళు విద్యార్థులైన శ్రీనివాస్‌గౌడ్, శ్రీశైలం యాదవ్, బాలరాజు గౌడ్‌లపై దాడి చేయడాన్ని ఆయన గర్హించారు. ఎన్ని తిట్టినా మిత్ర లాంటి వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు.

పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించాలని సీమాంధ్రులకు ఉన్న హక్కు.. తెలంగాణ వారికి లేదా? అని తెలంగాణ కాంగ్రెస్ సారధ్య బృందం ఆర్గనైజర్ జి.నిరంజన్ ప్రశ్నించారు. రెచ్చగొట్టడానికే ఎపిఎన్జీవోల సభ అని మంత్రి జానా రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం ఓపికతో ఉందామని, తెలంగాణ ప్రజలు సంయమనం పాటించారని, ఇలాగే పాటించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+