హైద్రాబాద్ మనది, విడదీయలేరు!: కిరణ్, ఎంపి కితాబు

ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఎపిఎన్జీవోల సభను ముఖ్యమంత్రి, నేతలు టివిలో వీక్షించారు. ఈ సందర్భంగా కిరణ్ వారితో ఆసక్తిక వ్యాఖ్యలు చేశారట. "హైదరాబాద్ ఈజ్ అవర్స్. హైదరాబాద్ మనందరిదీ. దాని నుంచి ఎవరూ మనల్ని వేరు చేయలేరు' అని కిరణ్ వ్యాఖ్యానించారట. రాజకీయ నేతల ప్రమేయం లేకుండా సీమాంధ్రలో నెల రోజులకుపైగా జరుగుతున్న ఆందోళనలతో అధిష్ఠానం అయోమయంలో పడిందని చెప్పారు.
ఢిల్లీలో పరిణామాలను గమనించిన తర్వాత రాష్ట్ర విభజన జరగదని స్పష్టమవుతోందని ధీమా వ్యక్తంచేశారు. శాంతి భద్రతల అంశానికి సంబంధించి ప్రభుత్వం ఉందన్న విశ్వాసాన్ని రాష్ట్ర ప్రజల్లో కల్పించాలని, అది కల్పించడంలో విజయవంతమయ్యామని చెప్పారు. ఇందుకు మిగిలిన కోస్తా నేతలు కూడా అంగీకరించారు. రాష్ట్రంలో 2009లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని లగడపాటి వ్యాఖ్యానించారు.
అప్పట్లో సమైక్యవాదులుగా ముద్రపడ్డ తనలాంటి వాళ్లను తెలంగాణవాదులు లక్ష్యంగా చేసుకునేవారని, హైదరాబాద్కు రావాలంటేనే తనలాంటివాళ్లు భయపడే పరిస్థితి ఉండేదని, చివరికి తాను రాజకీయ నేతల డ్రస్ను వీడి.. స్పోర్ట్స్మన్ వేషంలో హైదరాబాద్కు రావాల్సి వచ్చిందని, ఆ రోజుల్లో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా తనకు సంఘీభావం తెలపని పరిస్థితి నెలకొందని కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, అందరిలో ఆత్మ విశ్వాసం పెరిగిందని చెప్పారట.
గుండెల్లోని సమైక్యాంధ్రప్రదేశ్ గురించి బహిరంగంగా ధైర్యంగా మాట్లాడుతున్నారన్నారు. దీనికంతటికీ ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి, పోలీసు భద్రతపై ఉన్న భరోసానే కారణమని చెప్పారు. ఎపిఎన్జీవోల సభకు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ సీమాంధ్ర ఉద్యోగులు ధైర్యంగా తరలివచ్చారని, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు అధికసంఖ్యలో సభలో పాల్గొన్నారని, ఇదంతా ప్రభుత్వం తమకు రక్షణ కల్పిస్తుందన్న విశ్వాసంతోనేనని లగడపాటి అన్నట్లుగా తెలుస్తోంది.
ఆయన వాదనతో మిగిలిన మంత్రులు, శాసన సభ్యులు ఏకీభవించారట. సభ విజయవంతం కావడంతో సీమాంధ్ర ప్రాంతంలో కిరణ్ స్టార్ బ్యాట్స్మన్గా ఎదిగిపోయారని, తెలంగాణలోనూ ఆయన పట్ల విశ్వాసం పెరిగిందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నేతలు కిరణ్తో అన్నారట. ఈ సమయంలో లగడపాటి జోక్యం చేసుకుంటూ నవంబర్లో పెరేడ్ గ్రౌండ్స్లో పది లక్షల మందితో సభను నిర్వహించాలన్నారు. ఇందుకు జవాబుగా పెడదాం లే అని కిరణ్ అన్నారట.












Click it and Unblock the Notifications