ఢిల్లీ నేతల కనుసైగలతో జగన్, కెసిఆర్: బాబు
విజయవాడ: ఢిల్లీ నేతల కనుసైగలతో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు, కె. చంద్రశేఖర రావు (కెసిఆర్) నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నడుస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏ రెండు పార్టీలకు ఏం మాట్లాడాలో కేంద్రం నుంచి స్క్రీన్ ప్లే వస్తుందని ఆయన అన్నారు.
గత 40 రోజులుగా రాష్ట్రం అట్టడుకుతుంటే, కేంద్రానికి చీమకుట్టినట్టయినా లేదని ఆయన విమర్శించారు. కేంద్రం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఇరు ప్రాంతాల వారితో చర్చలు జరిపి, సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగువాడి ఆత్మగౌరవ యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు సోమవారం వినాయకచవితి సందర్భంగా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెంలో వినాయక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బాబు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి నెలకొందని, దేశంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలన్నీ తొలగిపోయి, దేశానికి, తెలుగుజాతికి పూర్వవైభవం రావాలని వినాయకున్ని ప్రార్థించినట్లు చెప్పారు. హైదరాబాద్లో సీమాంధ్ర ఉద్యోగులు వెళుతున్న బస్సులపై కాంగ్రెస్, తెరాస కార్యకర్తలు దాడులు చేశారని, అలాగే సీమాంధ్రలో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దాడులకు ఎగబడుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. వాళ్లు దాడులు చేసి రెండు ప్రాంతాల్లో తమ పార్టీని విమర్శిన్నాయని ఆయన అన్నారు.
కాగా, చంద్రబాబు బస్సు యాత్రంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరసన తెలిపారు. ఎన్టీఆర్ ప్రస్తావన తేవాలని వారు నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు వారిని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా జూ. ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన విరమించలేదు. పోలీసులు జోక్యంతో వివాదం సద్దుమణిగింది.