యుటిగా హైదరాబాద్ చెల్లదు, తెలంగాణకే: కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం ఇందిరాపార్కు దగ్గర వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జరిపిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం అసాధ్యమని కోదండరాం అన్నారు. ఒక ప్రాంతం రెండు రాష్ట్రాల్లో కలిపేందుకు వీలు లేనప్పుడు మాత్రమే కేంద్రపాలిత ప్రాంతం చేస్తారన్నారు.
తెలంగాణ జిల్లాల మధ్యలో ఉన్న హైదరాబాద్ రాజధానిగా కొనసాగుతూ..విశిష్టమైన చరిత్ర, సంస్కృతిని కలిగి ఉందని కోదండరాం అన్నారు. హైదరాబాద్లో దేశంలోని ప్రజలేకాక విదేశాలకు చెందిన పౌరులు కూడా నివసిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా రాజ్యాంగ బద్దంగా ప్రజలు ఇక్కడే ఉండవచ్చన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ పదవి నుంచి దిగిపోతేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని కోదండరాం అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాల వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని చెప్పారు. కిరణ్ రాష్ట్రం మొత్తానికి కాకుండా ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సీమాంధ్రులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తున్నారని కోదండరాం చెప్పారు.
అభివృద్ధి పేరిట సీమాంధ్ర పాలకులు హైదరాబాద్లో భూ దందాలు చేశారని విమర్శించారు. హైటెక్ సిటీ, శంషాబాద్ విమానాశ్రయాల నిర్మాణాలకు ముందే అక్కడి భూములను సీమాంధ్రులచే తక్కువ ధరలకు కొనిపించారని అన్నారు. ఆ తర్వాత భూముల ధరలు పెంచి సీమాంధ్ర పాలకులు సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు.
అది ముఖ్యమంత్రి సభే: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్లో జరిగిన సీమాంధ్రుల సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సభ అంటే బాగుంటుందని తెలంగాణ జేఏసీ కో-ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీమాంధ్రులకు పోలీసు భద్రత కల్పించి సమావేశానికి తీసుకువచ్చారని, మళ్లీ అదేవిధంగా పంపించారని అన్నారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యమాలు ఆగిపోవాలంటే తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించాలని అన్నారు.
ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలకు రక్షణ ఉండదని మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అధ్యక్షుడు హమీద్ అహ్మద్ ఖాన్ అన్నారు. సీమాంధ్రులది సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ కాదని షేమ్ ఆంధ్రప్రదేశ్ సభని ఆయన విమర్శించారు.