'అఖిలప్రియ తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఈ విషయం చంద్రబాబు వద్దకు వెళ్లింది'
కర్నూలు: మంత్రి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గన్మెన్లను తిరస్కరించడంపై హోంమంత్రి చినరాజప్ప బుధవారం నాడు స్పందించారు. ఈ సందర్భంగా ఆమెకు చురకలు అంటించారు. ఆమె తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
మంత్రి అఖిలప్రియ తెలుసుకోవాల్సింది చాలా ఉందని చినరాజప్ప అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే పెద్దల దృష్టికి తీసుకు వచ్చి, పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. గన్మెన్లను వెనక్కి పంపిన అంశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లిందని చెప్పారు. ఈ సమస్యను చంద్రబాబు పరిష్కరిస్తారని చెప్పారు.
కార్డాన్ సెర్చ్పై అసంతృప్తి
ఇటీవల ఆళ్లగడ్డలోని వివిధ పార్టీల ద్వితీయ శ్రేణి నేతల ఇళ్లల్లో గత బుధవారం అర్ధరాత్రి పోలీసులు అకస్మిక సోదాలు (కార్డాన్ సెర్చ్) నిర్వహించారు. ఇందులో భాగంగా అఖిలప్రియ అనుచరుల ఇళ్లలోను పోలీసులు సోదాలు జరిపారు. అనుచరులు ఆమెకు ఫిర్యాదు చేశారు. సోదాలపై ఆమె స్థానిక పోలీసులను అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేసినట్లు తెలిపారు.
వైయస్ జగన్కు నరేంద్ర మోడీ బెదిరింపులు: మోడీకి చంద్రబాబు షరతు, కేసీఆర్పై తీవ్రవ్యాఖ్య
అఖిలప్రియకు నచ్చచెప్పినా
తమ అనుచరుల ఇళ్లపై దాడులు చేయడం పైన ఆమె అసంతృప్తికి గురయ్యారు. వెంటనే గత గురువారం గన్మెన్లను పిలిచి వెనక్కి పంపించారు. ఈ విషయాన్ని గన్మెన్లు ఉన్నతాధికారులకు తెలిపారు. వారు మంత్రి అఖిలప్రియతో మాట్లాడి నచ్చచెప్పేందుకు ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. కానీ ఆమె శాంతించలేదని సమాచారం.
పోలీసులు లేకుండానే సభలకు
ఆమె జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఆ తర్వాత పలు గ్రామాల్లో పర్యటించారు. ఆ తర్వాత ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. భద్రత కల్పించేందుకు పోలీసులు రాగా, ఆమె నిరాకరించారని తెలుస్తోంది. పోలీసుల బందోబస్తు లేకుండానే ఆమె గ్రామసభలకు హాజరవుతున్నారు.