కరోనా ప్రళయం.. 24 గంటల్లో 20 వేలకు పైగా కేసులు
కరోనా ప్రళయం కొనసాగుతోంది. రోజు రోజుకు వైరస్ కేసుల హై కంటిన్యూ అవుతోంది. గత 23 గంటల్లో ఏపీలో 20 వేలకు పైగా కేసులు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. లాక్ డౌన్ విధించి.. పటిష్ట జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. కేసులు పెరగడం ఒక వంతు అయితే.. మరణాలు కూడా ఎక్కువే వస్తున్నాయి.
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం కొనసాగుతోంది. గత 24 గంటల్లో 86,878 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,345 మందికి పాజిటివ్ వచ్చింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,426 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 2,371 కేసులు, అనంతపురం జిల్లాలో 1,992 కేసులు, గుంటూరు జిల్లాలో 1,919 కేసులు గుర్తించారు. అదే సమయంలో 14,502 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా, 108 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో నిన్న తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో మరణించిన వారు కూడా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,22,934కి పెరిగింది. ఇప్పటివరకు 11,18,933 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 1,95,102 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 8,899కి పెరిగింది.