రేపటితో అమరావతి ఉద్యమానికి 250 రోజులు- రాజధాని రణభేరి పేరుతో నిరసనలకు విపక్షాల ప్లాన్..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా సాగుతున్న అమరావతి నిరనసలు రేపటితో 250 రోజులు పూర్తి చేసుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులు, విపక్ష పార్టీల నేతలు రాజధాని రణభేరి పేరుతో భారీ నిరసనలకు పిలుపునిచ్చారు.
రాజధాని గ్రామాల్లో ఉద్యమం సాగిస్తున్న రైతులు, జేఏసీ నేతలు రేపు రాజధాని రణభేరి పేరుతో భారీ నిరసనలకు పిలుపునిచ్చారు. రాజధాని ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉంటున్న తెలుగు వారు కూడా స్ధానికంగా నిరసనలు చేపట్టాలని జేఏసీ పిలుపునిచ్చింది. అమరావతినే రాజధానిగా ఉంచుతామని చెప్పి ఇప్పుడు మాట తప్పిన ప్రభుత్వానికి, నేతలకు వ్యతిరేకంగా ఈ నిరసనలకు పిలుపునిచ్చినట్లు జేఏసీ నేతలు తెలిపారు.
Recommended Video
రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రణభేరి పేరుతో నిరసనలు చేపట్టేలా జేఏసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో స్ధానికంగా అందరూ ఒక చోటకు చేరుకుని పళ్లాలు, గరిటెలు మోగించడం ద్వారా మూడు రాజధానుల నిర్ణయానికి తమ నిరసన తెలపాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. అన్నదాత ఆక్రందన పేరుతో నిరసనలు నిర్వహించి, కొంగుచాచి భిక్షాటన కూడా చేస్తామని జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ తెలిపారు. అన్ని ప్రాంతాల్లోనూ కరోనా నిబంధనలు పాటిస్తూనే నిరసనలు నిర్వహిస్తామన్నారు.