అమరావతి లాడ్జీ ఘటన .. కీచక ఎస్సై సస్పెండ్ .. ఎవరైనా సహించం : ఎస్పీ విజయారావు
ఏపీ రాజధాని అమరావతిలో ఒక మహిళపై లైంగికంగా వేధింపులకు పాల్పడిన కీచక ఎస్ఐ రామాంజనేయులుపై చర్యలకు ఉపక్రమించింది పోలీస్ శాఖ. లాడ్జిలో ఏకాంతంగా గడపాలి అనుకున్న లవర్స్ జంటను బెదిరించి వారి నుండి డబ్బులు వసూలు చేయడమే కాకుండా, సదరు మహిళ పై అఘాయిత్యానికి పాల్పడిన ఎస్ఐ ను సస్పెండ్ చేశారు ఐజి. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు, విధి నిర్వహణ మాని ఈ విధంగా ప్రవర్తిస్తే చూస్తూ సహించబోమని తేల్చి చెప్పారు.
ఇక ఈ వ్యవహారంలో అమరావతి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు ఎస్పీ విజయరావు. లాడ్జిలో మహిళలు వేధింపులకు గురిచేసిన ఎస్ఐ విషయంలో డీఎస్పీతో విచారణ జరిపించిన ఎస్పీ విజయరావు అమరావతి లాడ్జిలో జరిగిన ఎస్ఐ ఉదంతం నిజమేనని పేర్కొన్నారు. మహిళతో తప్పుగా ప్రవర్తించిన ఎస్సై పై చర్యలు తీసుకుంటున్నామని,అందులో భాగంగా అతన్ని సస్పెండ్ చేశామని ఎస్పీ విజయరావు పేర్కొన్నారు.

ఎస్సై రామాంజనేయులు పరారీలో ఉన్నారని చెప్పిన ఎస్పీ, ఎస్సై రామాంజనేయులు తో పాటుగా అతని డ్రైవర్ పై కూడా కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ఎవరు ఎలాంటి తప్పు చేసినాఉపేక్షించేది లేదని, కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విజయరావు తేల్చిచెప్పారు. ఇక తాజాగా పెదకూరపాడుకు చెందిన ఒక జంట ఏకాంతంగా గడపడానికి అమరావతి లోని ఒక లాడ్జిలో బస చేయగా వారిని బెదిరించి లంచం తీసుకున్నాడు ఎస్సై రామాంజనేయులు.
అంతేకాకుండా సదరు మహిళతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఇక ఆ మహిళ తిరగబడడంతో వారి వద్ద నుండి డబ్బులు తీసుకొని, ఎవరికైనా చెబితే కేసు పెడతా అంటూ బెదిరించి వెళ్ళిపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురైన బాధితులు డిఎస్పి ని కలిసి ఎస్సై పై ఫిర్యాదు చేశారు. ఇక ఈ సంఘటనపై విచారణ జరిపిన డి.ఎస్.పి ఉన్నతాధికారులకు నివేదిక అందించగా, ఉన్నతాధికారులు ఎస్ఐని సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications