అమరావతి సిటీ కార్పోరేషన్ పై జగన్ సర్కార్ కు సెగ- ప్రజాభిప్రాయసేకరణలో వ్యతిరేకత
అమరావతిలో వైసీపీ సర్కార్ ప్రతిపాదిస్తున్న రాజధాని నగర పాలక సంస్ధ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. ఇవాళ ముందుగా రాజధానిలోని కురగల్లు గ్రామంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇందులో పెద్ద ఎత్తున హాజరైన రైతులు, స్ధానికులు కార్పోరేషన్ ప్రతిపాదనను వ్యతిరేకించారు.
అమరావతి క్యాపిటల్ సిటీ కార్పోరేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనను కురగల్లు గ్రామస్తులు ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. దీన్ని కురగల్లు గ్రామస్తులు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కురగల్లు సభలో ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో దాని తర్వాత అధికారులు నీరుకొండలో ప్రజాభిప్రాయం తీసుకుంటున్నారు. అక్కడా దాదాపు ఇదే పరిస్ధితి.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిగా ప్రతిపాదించిన 25 గ్రామాల పరిధిలోనే ఈ నగర పాలక సంస్ధను ఏర్పాటు చేయాలని ఇక్కడి రైతులు, స్దానికులు కోరుతున్నారు. తమను విభజించు పాలించు సిద్ధాంతం ప్రకారం వైసీపీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తీసుకొస్తోందని వారు మండిపడుతున్నారు. దీంతో ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తున్నారు.
గతంలోనూ ఇక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో అమరావతి కార్పోరేషన్ పై వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే రాజధాని చట్టాలు వెనక్కి తీసుకున్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఇక్కడ ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరోసారి ఈ కార్పోరేషన్ తెరపైకి వచ్చింది. మెజార్టీ గ్రామాలు కార్పోరేషన్ ఏర్పాటు ప్రతిపాదననను వ్యతిరేకిస్తే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications