టీనేజర్లకు టీకా: ఏపీ ఫస్ట్, హిమాచల్ ప్రదేశ్ కూడా
కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. వైరస్కు విరుగుడు టీకాయే.. అందుకే సెకండ్ డోసుపై వైద్యాధికారులు పోకస్ చేశారు. ఇటు పిల్లల వ్యాక్సినేషన్లో ఏపీ దూకుడు కొనసాగుతోంది. నిర్దేశించిన లక్ష్యంలో శుక్రవారం నాటికి 72 శాతం మందికి వైద్య, ఆరోగ్య శాఖ టీకా ప్రక్రియను పూర్తిచేసింది. దీంతో దేశంలో తొలిస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో కేవలం 28 శాతం మందికి మాత్రమే టీకా వేయాల్సి ఉంది. దేశంలో ఇప్పటివరకూ 50 శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తిచేసిన రాష్ట్రాల జాబితాలో ఏపీ, హిమాచల్ప్రదేశ్ మాత్రమే ఉన్నాయి.
హిమాచల్ప్రదేశ్లో 68.40 శాతం మంది పిల్లలకు టీకా వేశారు. దక్షిణాదితోపాటు, దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క పెద్ద రాష్ట్రంలోనూ 50 శాతానికి మించి టీకా పంపిణీ కాలేదు. దేశవ్యాప్తంగా గత సోమవారం నుంచి 15-18 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా పంపిణీ ప్రారంభించారు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలో అర్హులైన 24,41,000 మంది పిల్లలకు వారం రోజుల్లో టీకా పంపిణీ పూర్తిచేసేలా సర్కారు కార్యాచరణ రూపొందించింది. శుక్రవారం నాటికి 17,52,581 మందికి టీకాలు వేశారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో టీకాలు వేయడంతోపాటు, వీటి పరిధిలో ఉన్న విద్యా సంస్థల వద్దకు ఆరోగ్య సిబ్బంది వెళ్లి మరీ టీకాలు వేస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 1,55,086 మందికి టీకా పంపిణీ చేయాల్సి ఉండగా 91.11 శాతం అంటే 1,41,304 మందికి టీకా పంపిణీ జరిగింది. తూర్పు గోదావరిలో 86.36 శాతం, నెల్లూరులో 84.76 శాతం, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 53.59 శాతం మందికి వ్యాక్సినేషన్ చేశారు.
ఇటు కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.
ఇటు కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అందుకు తగిన జాగ్రత్తలను తీసుకుంటుంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టంచేసింది. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. ఒమిక్రాన్ వైరస్ వాయువేగంతో వ్యాపిస్తోంది. ఒకరికి సోకితే.. ఆ ఫ్యామిలీకి దాదాపుగా వస్తోంది. సన్నిహితంగా మెలిగితే చాలు వైరస్ వస్తోంది.