అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ఎందుకు దాచారు.. ఏపీ జేఏసీ నేత బొప్పరాజు
అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదు. ఆ నివేదికలో రహస్యమేముంది అని ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్, పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు తలపెట్టిన 'ఛలో విజయవాడ' కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బొప్పరాజు ఆరోపించారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు దీన్ని గమనించాలని కోరారు.

దుష్ప్రచారం తగదు
వాట్సాప్, సోషల్ మీడియాలో ఉద్యోగులపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమను చర్చలకు పిలిచినట్టు, తామేదో రహస్యంగా కొన్నింటికి ఒప్పుకున్నట్టు, హెచ్ఆర్ఏ శ్లాబులు ఇస్తున్నట్టు తప్పుడు వార్తలు పంపిస్తున్నారని బొప్పరాజు తెలిపారు. తప్పుడు ప్రచారం చేయడం కోసమే కొంతమందిని నియమించారని ఆరోపించారు. అయితే ఈ వార్తలను రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎవరూ నమ్మరాదని, అందరూ ఐక్యంగా పోరాడాలని అన్నారు.

3 డిమాండ్లు
3 ప్రధాన డిమాండ్లకు అంగీకరిస్తేనే చర్చలకు వస్తామనే విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేశామని తెలిపారు. చర్చలకు రావాలంటూ ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ పెట్టారని, లిఖితపూర్వకంగా ఆహ్వానిస్తేనే చర్చలకు వెళతామని పేర్కొన్నారు. ఉద్యోగుల జీతాలపై ట్రెజరీ అధికారులను బెదిరిస్తూ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, మెమోలు జారీ చేస్తే భయభ్రాంతులకు గురిచేస్తోందని బొప్పరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటవిక రాజ్యం కాదు..
ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు ఇది అటవిక రాజ్యం కాదని స్పష్టం చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తేనే చర్యలు తీసుకునే అధికారం ఉంటుందని వెల్లడించారు. అలాకాకుండా, కక్షసాధింపు ధోరణితో అధికారులపై చర్యలు తీసుకోరాదని పేర్కొన్నారు. తమకు న్యాయసలహాలు ఇచ్చేందుకు రవిప్రసాద్, సత్యప్రసాద్ అనే న్యాయవాదులను నియమించుకున్నట్టు బొప్పరాజు వెల్లడించారు. ఫిబ్రవరి 3వ తేదీన ఛలో విజయవాడ చూసైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. 'ఛలో విజయవాడ' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పిలుపునిచ్చారు.
Recommended Video

కుదరని ఏకాభిప్రాయం
పీఆర్సీపై ఉద్యోగులు- ప్రభుత్వం మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రణాళిక ప్రకారం ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధం అవుతున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన లక్షలాదిమందితో నిర్వహించే ఛలో విజయవాడను విజయంతం చేయాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కార్యక్రమం చూసైనా ప్రభుత్వంలో మార్పు రావాలని ఆశించారు. మెరుగైన పీఆర్సీ కోసం ఐక్య ఉద్యమ కార్యాచరణ ప్రకటించామని తెలిపారు. మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని.. కార్మిక, ఉపాధ్యాయులు, పెన్షనర్లను జాగృతం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు.












Click it and Unblock the Notifications