పోలవరం చూడాలా నాయనా! తడిసి మోపడవుతున్న సందర్శన ఖర్చు
అమరావతిః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రచార కార్యక్రమాలపై ఆసక్తి చాలా ఎక్కువే. అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు, ఏ పనిచేసినా దాని గురించి చేసే ప్రచారానికి భారీగా ఖర్చు చేస్తుంటారు. పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభించే విషయంలో గానీ, రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంలో గానీ, పోలవరం ప్రాజెక్టు అంశంలోనైనా ఇదే కనిపిస్తుంది. ఇక, ఓ మోస్తరు స్థాయి పథకాలకు సంబంధించిన ప్రచారానికి లెక్కే ఉండదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం తరహాలోనే ప్రాజెక్టు సందర్శనకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలకు అవుతున్న వ్యయం కూడా భారీగా పెరుగుతోంది.

మొదట్లో రూ.19 కోట్లు, ఇప్పుడు రూ.70 కోట్లు
భారీఎత్తున నిర్మితమౌతోన్న పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రజలంతా సందర్శించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ప్రాజెక్టును చూడటానికి ఆసక్తి చూపే వారి కోసం ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు వద్ద భోజన సదుపాయం కల్పిస్తోంది. దీనికోసం మొదట్లో చంద్రబాబు ప్రభుత్వం సుమారు 19 కోట్ల రూపాయలను కేటాయించింది. సందర్శకులను ప్రాజెక్టు తరలించే బాధ్యతను స్థానిక పార్టీ నాయకులకు అప్పగించింది. మండలాన్ని యూనిట్ గా తీసుకుని ప్రజలను ప్రాజెక్టు వద్దకు తరలించాలని ఆదేశించింది.

సర్కారీ పని, పార్టీ నాయకుల చేతుల్లో
ప్రభుత్వం అప్పజెప్పిన ఈ పనిని పార్టీ నాయకులు అమలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను సమకూర్చడం, ప్రాజెక్టు వద్ద గైడ్లుగా వ్యవహరించడం, అక్కడ భోజన వసతి.. ఇలాంటి పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. సందర్శనకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. దీనికి అనుగుణంగా వ్యయం కూడా. ఇప్పటికే దీని ఖర్చు 32 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఎన్నికలు దగ్గర పడే సమయానికి సందర్శకుల సంఖ్యను మరింత పెంచాలని ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖికంగా ఆదేశాలు వెళ్లిపోయాయి. సందర్శకుల తాకిడి గణనీయంగా ఉండటంతో ఈ మొత్తాన్ని 70 కోట్ల రూపాయలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ఈ మొత్తాన్ని సందర్శకుల కోసం కేటాయించాల్సిందిగా సూచిస్తూ, బడ్జెట్ పెంచి కేటాయించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల ఆమోదానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కు లేఖ రాశారు అధికారులు. ప్రతిరోజూ ఒక్కో జిల్లా నుంచి రెండు చొప్పు బస్సులను ఏర్పాటు చేసి, సందర్శకులను తరలించేలా, వారి సంఖ్యకు సరిపడేలా బడ్జెట్ను కేటాయించాలని ఇందులో పేర్కొన్నారు. రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాలు, దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి ప్రాజెక్టు వద్ద రెండు పూటలా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.

100 బస్సులు కూడా సరిపోవట్లేదట
ప్రస్తుతం ప్రతిరోజూ 13 జిల్లాల నుంచి దాదాపు 100 బస్సుల్లో జనం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారు. ఎన్నికలు సమీపించే సమయానికి బస్సుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. సెలవు రోజులు, వారాంతపు రోజుల్లో అంచనాకు మించి సందర్శకులు ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. ప్రాజెక్టు సందర్శన కార్యక్రమాన్ని చేపట్టినప్పటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు 302 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 8 లక్షల 10 వేల మందికి పైగా సందర్శకులు ప్రాజెక్టును తిలకించి వెళ్లారు.

ఆర్టీసీకి మొండిచెయ్యే
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బస్సులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. దీనికయ్యే రీఎంబర్స్మెంట్ మొత్తాన్ని విడుదల చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులకు లేఖలు రాసింది. దీనిపై పెద్దగా స్పందన రాలేదు. తొలిదశలో 14 కోట్ల రూపాయలను బస్సులకు అద్దె రూపంలో చెల్లించాలని ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇందులో కొంత మొత్తమే విడుదలైందని అధికారులు చెబుతున్నారు. ఇక అక్కడితో ఆగిపోవచ్చని కూడా అంటున్నారు. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై పోలవరం ప్రాజెక్టు సందర్శన వ్యయం తడిసి మోపెడవుతోంది.
అద్దె మొత్తాన్ని చెల్లిస్తే ఫర్వాలేదని, రాకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు ఆర్టీసీ అధికారులు. అలాంటిది, ఇప్పుడు బస్సుల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఏర్పడుతుందని, దీనికోసం నష్టాలు వచ్చే రూట్లల్లో సర్వీసులను తగ్గించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే- ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాలకు ప్రజలు, విద్యార్థులను తరలించామని, దానికి రావాల్సిన అద్దె మొత్తం కూడా అందట్లేదని చెప్పారు. గతంలో నవ నిర్మాణ దీక్ష, ఆ తరువాత ధర్మ పోరాట దీక్ష, మధ్యలో జన్మభూమి-మా ఊరు వంటి అనేక కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులను సమకూర్చింది. దీనికి సంబంధించిన అద్దె మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయలేదు. ఆ నిధులు వస్తాయన్న ఆశ కూడా లేదని వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications