సగం మంది సర్కార్ స్కూళ్లోనే.. మరీ డిప్యూటీ సీఎం పిల్లలు, మనవలు: ఏపీ ఉద్యోగ జేఏసీ
పీఆర్సీ గురించి ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సమ్మె అనివార్యం అయ్యింది. అయితే సీఎం జగన్ ను ఉపాధ్యాయులు నోటికొచ్చినట్టు మాట్లాడడం తగదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. దాంతోపాటు లక్షల జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు తమ పిల్లలను మాత్రం ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్లపై ఏపీ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఫ్యాప్టో చైర్మన్ సుధీర్ బాబు కౌంటర్ ఇచ్చారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లల్లో సగం మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారని వెల్లడించారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి పిల్లలు, మనవళ్లు ఎక్కడ చదివారు? అంటూ నిలదీశారు. పీఆర్సీ సమస్యను పరిష్కరించలేక మంత్రులు డ్రామాలు ఆడుతున్నారని సుధీర్ బాబు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి బాధ్యతగా మెలగాలని హితవు పలికారు.
మంత్రి వ్యాఖ్యలపై ఫ్యాప్టో ప్రతినిధి హృదయరాజ్ స్పందించారు. తాము పీఆర్సీ గురించి పోరాడుతుంటే మంత్రి నారాయణస్వామి మరో అంశం గురించి మాట్లాడడం సరికాదని అన్నారు. కార్పొరేట్ స్కూళ్లు లేని వ్యవస్థను ఈ ప్రభుత్వం తీసుకురాగలదా? అని ప్రశ్నించారు.
అంతకుముందు ఉద్యోగ సంఘాలు అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదని అడిగారు. ఆ నివేదికలో రహస్యమేముంది అని ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్, పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు తలపెట్టిన 'ఛలో విజయవాడ' కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బొప్పరాజు ఆరోపించారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు దీన్ని గమనించాలని కోరారు.
Recommended Video
వాట్సాప్, సోషల్ మీడియాలో ఉద్యోగులపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమను చర్చలకు పిలిచినట్టు, తామేదో రహస్యంగా కొన్నింటికి ఒప్పుకున్నట్టు, హెచ్ఆర్ఏ శ్లాబులు ఇస్తున్నట్టు తప్పుడు వార్తలు పంపిస్తున్నారని బొప్పరాజు తెలిపారు. తప్పుడు ప్రచారం చేయడం కోసమే కొంతమందిని నియమించారని ఆరోపించారు. అయితే ఈ వార్తలను రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎవరూ నమ్మరాదని, అందరూ ఐక్యంగా పోరాడాలని అన్నారు.