Severe Rainfall Alert:వద్దంటే వాన, మళ్లీ 2 రోజులు వర్షాలు
వర్షం అంటేనే హడలే పరిస్థితి నెలకొంది. ఈ నెల 29వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. నెల్లూరు, రాయలసీమ జిల్లాలను వర్షాలు వీడట్లేదు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. అల్పపీడనం క్రమంగా బలపడి కోస్తాంధ్ర తీరానికి సమీపించనుందని అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.
చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో 13 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించారు. పది రోజుల క్రితం వర్షాలకు గత వారం వరదలతో విలవిల్లాడాయి నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలు. ఇప్పుడు మళ్లీ వర్ష హెచ్చరికలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తం అయ్యాయి.
చిత్తూరు జిల్లాలోని తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కలెక్టర్ హరి నారాయణన్ అన్నారు. ఆయా ప్రాంతాల్లోని అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వర్ష హెచ్చరికలతో చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు. కాజ్వేలు దాటొద్దని హెచ్చరించారు.

చెన్నైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోతోంది. వాహనాల రాకోపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. ఇటీవల రెండు సార్లు భారీ వర్షాలతో చెన్నై మునిగింది. ఆ కష్టాల నుంచి తేరుకుంటున్న నగరవాసులను మళ్లీ వర్షాలు కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. చెన్నై, సబర్బన్ ప్రాంతాల్లో వర్షపు నీరు కాలనీలు, ఇళ్లను ముంచెత్తింది. మురికివాడలు, చిన్న చిన్న కాలనీల నుంచి ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు విధులకు హాజరుకాలేకపోతున్నారు. రాయపేట, రాయపురం, మైలాపూరు, అడయారు, అంబత్తూరు, తాంబరం, వేళచ్చేరి, కోయంబేడు ప్రాంతాల్లో రెండడుగుల మేర వర్షపునీరు వరదలా ప్రవహించింది.
విరుగంబాక్కంలోని సుబ్రమణియన్ వీధికి ఇరువైపులా ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. టి.నగర్, హబీబుల్లా రోడ్డు, పాండీ బజార్, వళ్లువర్ కోట్టం, నుంగంబాక్కంలోని రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. కోడంబాక్కం, వడపళని, రంగరాజపురం, కలైంజర్నగర్, రాజాజీనగర్, కార్గిల్ నగర్, చార్లెస్ నగర్లోని పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీటిని తొలగించేందుకు చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. చెన్నైలోని 91 పునారావాస కేంద్రాల్లో బాధితులు తలదాచుకున్నారు.












Click it and Unblock the Notifications