Severe Rainfall Alert:మళ్లీ 3 రోజులు వర్షాలు.. బెంబేలెత్తుతున్న ఆ జిల్లాల ప్రజలు
వర్షం అంటేనే ఏపీలో జనం భయపడే పరిస్థితి. అయితే అల్పపీడనం, వాయుగుండం పేరుతో వర్షాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వరదలతో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ప్రాణ నష్టంతోపాటు ఆస్తి, పంట నష్టం జరిగింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ శ్రీలంక తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం కోమరిన్ ప్రాంతంతో పాటు దానిని ఆనుకొని ఉన్న శ్రీలంక తీర ప్రాంతానికి చేరుకుంది. ఇది సగటు సముద్ర మట్టానికి.. 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 29 తేదీ వరకు దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని తెలిపింది. ఫలితంగా ఏపీలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Recommended Video
ఏపీని వరదలు బీభత్సం సృష్టించాయి. వర్షాలతో కొన్ని జిల్లాలు వణికిపోయాయి. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు అపార నష్టాన్ని మిగిల్చింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. దీంతో రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. వరద ఉధృతికి ఎంతోమంది కొట్టుకుపోయారు. పలువురి మృతదేహాలను ఇప్పటివరకు వెలికితీయగా..మరికొంతమంది ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. తక్షణమే రూ. 1000 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం జగన్ కోరారు. వరద నష్టం అంచనా వేసేందుకు నవంబర్ 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనుంది. సీఎం జగన్ రాసిన లేఖకు స్పందించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపనుంది.












Click it and Unblock the Notifications