బీజేపీకి "ఢీ".. వైఫల్యాలపై "థర్డ్ ఐ".. చంద్రబాబు మహా మీటింగ్ తో వేడెక్కిన ఢిల్లీ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాలకు ఒక్కరోజే మిగిలింది. ఈనేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ వేడేక్కింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరం ఎన్నికల ఫలితాలు వెలువడే ఒక్కరోజు ముందు బీజేపీయేతర పక్షాల సమావేశం చర్చానీయాంశంగా మారింది. బీజేపీకి ప్రత్నామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సోమవారం జరగనున్న ఈ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది.
బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తెచ్చే పనిలో పడ్డారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొనేలా వ్యూహరచన చేస్తూ ముందుకెళుతున్న బాబుకు వివిధ పక్షాల నేతలు సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీకి దీటుగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న బాబు ఆలోచనలకు మరికొంతమంది తోడవుతున్నారు.

బీజేపీకి "ఢీ".. ప్రత్యామ్నాయ ఫ్రంట్
బీజేపీయేతర కూటమి ఏర్పాటు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి దీటుగా అలయెన్స్ తీసుకురావడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. అందులోభాగంగా దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి చంద్రబాబు నాయుడే సారధ్యం వహిస్తున్నారు. బీజేపీయేతర పక్షాలను కలుపుకొనిపోయే విధంగా అన్నీ పార్టీల నేతల్ని ఈ మీటింగ్ కు ఆహ్వానించారు.

ఆల్ ఓకే ఎవరెవరు వస్తున్నారు..!
చంద్రబాబు సారధ్యంలో జరుగుతున్న బీజేపీయేతర పక్షాల సమావేశానికి వివిధ పార్టీల అధినేతలు హాజరుకానున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ కూడా ఈ సమావేశానికి వచ్చే అవకాశముంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి ఉమ్మడి విపక్షాల దెబ్బ చూపించే అంశంపై చర్చించే ఛాన్సునట్లు కనిపిస్తోంది.
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫారూఖ్ అబ్దుల్లా, సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, సీపీఐ జనరల్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, డీఎంకే ప్రెసిడెంట్ స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, లోక్ తాంత్రిక్ జనతా దళ్ నేత శరద్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని సమాచారం.
బీఎస్పీ అధినేత్రి మయావతి ఈ మీటింగ్ కు హాజరయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నుంచి సతీశ్ చంద్ర మిశ్రా హాజరవుతారని సమాచారం.
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ హాజరవుతారని.. ఒకవేళ ఆయన రాని పక్షంలో సీనియర్ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ వస్తారనే టాక్ వినిపిస్తోంది.
బీజు జనతాదళ్ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ సమావేశానికి రావట్లేదు. అయితే సాధారణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీయేతర కూటమితో జతకడతారని తెలుస్తోంది.

కూటమి కాదు.. ప్రధాని ఎవరో తేల్చండి ఫస్ట్..!
బీజేపీయేతర కూటమికి సంబంధించిన ఈ సమావేశంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా స్పందించారు. అందరూ కలిసి అలయెన్స్ గా ఏర్పడటం ప్రధానం కాదని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనుకునే ముందు అసలు వారి తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎజెండా లేకుండా జెండాలెన్ని కలిసినా ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు.

బీజేపీ వైఫల్యాలపై "థర్డ్ ఐ"..! ఎజెండా ఏంటి?
బీజేపీయేతర కూటమి అంటూ చంద్రబాబు సారధ్యంలో సోమవారం తలపెట్టిన సమావేశం హాట్ టాపికయింది. గత నెలలోనే వివిధ పక్షాల నేతలతో సమావేశమైన చంద్రబాబు పలు అంశాలపై ఇప్పటికే చర్చించారు. ముఖ్యంగా ధరల పెరుగుదల, నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం, నిరుద్యోగం తదితర అంశాలతో తాజా సమావేశం ఎజెండాగా ఉండబోతోంది. ఈ మీటింగ్ తొలుత నవంబర్ 22న అనుకున్నప్పటికీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications