YS Jagan: రాజధాని రైతుల మెరుపు ముట్టడి: సచివాలయం వద్ద బైఠాయింపు, జగన్ బ్యానర్ల చించివేత..!
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు సభలో చేసిన ప్రకటనకు నిరసనగా రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా నిరసన ప్రదర్శనలను చేపట్టిన రైతులు.. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా మెరుపు ముట్టడికి దిగారు. వెలగపూడిలోని సచివాలయాన్ని ముట్టడించారు. వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
సీఆర్డీఏ రైతుల్లో ఆగ్రహావేశాలు..
అమరావతి సహా విశాఖపట్నం, కర్నూలులల్లో రాజధానులను ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ ఇటీవలే శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. శాసనసభ ముగింపు రోజు ఆయన ఈ ప్రకటన చేశారు. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసనసభ రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును మార్చే ఆలోచన ఉందని వెల్లడించారు. ఆయన చేసిన ఈ ప్రకటన పట్ల రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలోని రైతులు పెద్ద ఎత్తున నిరసనను వ్యక్తం చేశారు.
సచివాలయం ముట్టడి..
అనూహ్యంగా రాజధాని ప్రాంత రైతులు వెలగపూడిలోని సచివాలయాన్ని ముట్టడించారు. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం జగన్ డౌన్, డౌన్ అని గళమెత్తారు. సచివాలయం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. వైఎస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలను తెలియజేస్తూ సచివాలయం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను చించేశారు. వాటిని తగులబెట్టారు.
పోలీసులు నచ్చజెప్పినప్పటికీ..
సచివాలయం వద్ద ఉన్న పోలీసులు వారిని రైతులను అడ్డుకున్నారు. రోప్ పార్టీతో రైతులను ఎటూ కదలకుండా అదుపు చేశారు. దీనితో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. రోప్ పార్టీని దాటుకుని సచివాలయంలోనికి ప్రవేశించడానికి విఫలయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు వారిని నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ వినిపించుకోలేదు. అక్కడే బైఠాయించారు. దీనితో సచివాలయం పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications