30 శాతం కాస్తా.. 16 శాతం ఇస్తామని మెలిక.. హెచ్ఆర్ఏపై ఏపీ జేఏసీ
హెచ్ఆర్ఏ పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఏపీ జేఏసీ స్పందించింది. ప్రభుత్వం జారీ చేసిన హెచ్ఆర్ఏ జీవోలో కొత్తదనం లేదని అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం హెచ్ఆర్ఏ శ్లాబులో తగ్గించిన దాంట్లో భాగంగా ఇచ్చిందే జీవో అన్నారు. జీవోలో అన్నీ లొసుగులే ఉన్నాయని చెప్పారు. 3 0శాతం ఇవ్వాల్సిన హెచ్ఆర్ఏ, ఏ ప్రాతిపదికన 16 శాతం ఇస్తున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ జీవోకు శాస్త్రీయత లేదని చెప్పారు.
11వ పీఆర్సీలో 30శాతం తగ్గకుండా ఇవ్వాల్సి ఉందన్నారు. దాన్ని తుంగలో తొక్కి, తూతూ మంత్రంగా ఏర్పాటైన అధికారుల కమిటీ ఈ జీవో ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని బొప్పరాజు అడిగారు. విజయవాడలో కానీ, గుంటూరులో కానీ.. ఈ హెచ్ఆర్ఏ ప్రకారం ఇళ్లు అద్దెకు దొరుకుతాయా? అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అడిగారు. అశుతోష్ నివేదికలో 30 శాతం హెచ్ఆర్ఏను ప్రతిపాదించారని ఆయన అన్నారు. ఉద్యోగులపై అక్కసుతోనే డీడీవోలకు, ట్రెజరీ అధికారులకు ప్రభుత్వం మెమోలు ఇచ్చిందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో.. ఏ నెలలోనూ ఒకటో తేదీన జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. ఇప్పుడేమో ఫిబ్రవరి 1వ తేదీనే జీతాలు వేస్తామంటూ ప్రభుత్వం ఎందుకు తొందరపడుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ చెల్లింపుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విజయవాడ దాని పరిసరాల్లోని హెచ్ఓడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. హెచ్ఆర్ఏ 8 శాతం నుంచి 16 శాతానికి పెంచింది. హెచ్ఓడీ అధికారుల సిఫార్సులతో హెచ్ఆర్ఏలను సవరించింది సర్కార్. అయితే ఇది రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ చెందిన పెంపు కాదు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ పరిసరాలకు తరలివచ్చిన హెచ్వోడీ కార్యాలయాల సిబ్బందికి మాత్రమే వర్తిస్తుంది.
గతంలో పాత పీఆర్సీ ప్రకారం ఈ ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏ అమలయ్యేది. అయితే, కొత్త పీఆర్సీ జీవోల్లో జారీ చేసిన ఆదేశాల మేరకు హెచ్ఆర్ఏ తగ్గించారు. విజయవాడ - మంగళగిరి ప్రాంతాల్లో హైదరాబాద్ నుంచి వచ్చి రీ లొకేట్ అయిన ఉద్యోగులకు ప్రస్తుతం 8 శాతం మాత్రమే హెచ్ఆర్ఏ అమలు చేసే విధంగా కొత్త పీఆర్సీ జీవోలో పేర్కొన్నారు. ఇప్పుడు వారికి 8 శాతం నుంచి 16 శాతానికి పెంచుతూ తాజాగా సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ అంశానికి సంబంధించి ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. సమ్మెకు సైతం ఉద్యోగ సంఘాలు నోటీసులు ఇచ్చాయి.