పంచాయతీ తర్వాత పరిషత్ ఎన్నికలు.. ఎస్ఈసీ క్లారిటీ.. రేషన్ వాహనాల రంగుపై అభ్యంతరం
ఏపీలో ఎన్నికల సీజన్ కొనసాగుతోందా అంటే ఔననే అంటోంది ఎస్ఈసీ. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అంటున్నారు. అంతేకాదు ఎన్నికల కోడ్ కంటిన్యూ అవుతోందని రంగులు పునరుద్దరించొద్దని నిమ్మగడ్డ స్పష్టంచేశారు. నిమ్మగడ్డ సూచనలతో జగన్ సర్కార్ డిఫెన్స్లో పడిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
వంకాయ, క్యారెట్, కుర్చీ.. ఇవీ ఏపీ పంచాయతీ గుర్తులు, 25 గుర్తులకు ఎస్ఈసీ ఆమోదం..

జడ్పీ ఎన్నికలు..?
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం సంకేతాలు ఇచ్చింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాలకు వైసీపీ రంగులకు సంబంధించిన ఆదేశాల్లో ఈ విషయం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే రేషన్ వాహనాలకు ఏవైనా తటస్థ రంగులు వేయాలని సూచించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తవగానే మళ్లీ వైసీపీ రంగులు పునరుద్ధరించవద్దని.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయ్యే దాకా తటస్థ రంగులు కొనసాగించాలని తెలిపింది.

వాహనాలపై ఇప్పుడే రంగులు వద్దు
పంచాయతీ ఎన్నికలు పూర్తవగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రారంభిస్తామని, అవి పూర్తయ్యే వరకు వాహనాలపై తటస్థ రంగులు ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రాష్ట్రంలో పరిషత్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయా.. లేదా..? జరిగితే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి చేపడతారా..? ఎక్కడ ఆగిపోయాయో అక్కడి నుంచే మొదలుపెడతారా అన్న సందేహాలు వస్తున్నాయి. రేషన్ వాహనాలపై రంగుల విషయంలో స్పష్టత ఇస్తూ జారీ చేసిన ఆదేశాల్లో ఈ అనుమానాలను నివృత్తి చేసింది.

4 వారాల ముందు కోడ్
పంచాయతీ ఎన్నికలు పూర్తవగానే పరిషత్ ఎన్నికలు జరుగుతాయని స్పష్టమవుతోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. పరిషత్ ఎన్నికలు ఎప్పుడు ప్రారంభించినా.. 4 వారాల ముందు కోడ్ అమల్లో ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 21తో పంచాయతీ ఎన్నికలు ముగిస్తాయి. ఆ వెంటనే పరిషత్ ఎన్నికలు ప్రారంభించే అవకాశం ఉంది. కోడ్ అమల్లో ఉన్నందున వెంటనే పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు తీర్పు అడ్డు రాదని భావిస్తున్నారు. మరీ దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలీ మరీ.