అల్లూరికి జనసేనాని అంజలి: సీతారామరాజు లక్ష్యంతో పనిచేస్తాం అంటూ ప్రతీన
విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి నేడు.. భీమవరంలో ప్రధాని మోడీ అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లలేదు. కానీ జయంతి వేడుకల్లో మాత్రం పాల్గొన్నారు. అణచివేతలో ఉద్భవించిన విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ప్రజల సంపద, ప్రాణాలకు పాలకులే భక్షకులైన రోజు అంటూ కామెంట్ చేశారు. అవినీతి, పక్షపాతానికి గురయిన సమయంలో ప్రభుత్వాలను కూకటివేళ్లతో పెకలించే వీరులు ఉదయిస్తారని పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు.
గిరిపుత్రులకు బతుకు పోరాటం
గిరిపుత్రులకు బతుకుపోరాటం నేర్పి, ఆ పోరాటంలోనే అమరుడైన విప్లవజ్యోతి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆ మహావీరుడికి నమస్సుమాంజలి అర్పిస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. గిరిపుత్రుల హక్కుల కోసం చిన్న వయసులో విప్లవబాట పట్టాడని గుర్తెశారు. 27 ఏళ్లకే అమర వీరత్వం పొందిన సీతారామరాజు దేశ స్వాతంత్రోద్యమానికి దివిటీగా మారడం తెలుగుజాతికి గర్వకారణం అని కామెంట్ చేశారు.
అక్కడ దోపిడీదారులు
ఎక్కడ పాలకులు గతి తప్పుతారో, ఎక్కడ పాలకులు దోపిడీదారులుగా మారతారో అక్కడ సీతారామరాజు స్ఫూర్తితో వీరులు పుడుతూనే ఉంటారని పవన్ కల్యాణ్ తెలిపారు. వీరుడు జన్మించిన పుణ్యభూమిపై జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నా పేర్కొన్నారు. ఏ లక్ష్యం కోసం అల్లూరి సీతారామరాజు అమరుడయ్యాడో ఆ లక్ష్యంతో జనసేన పార్టీ ముందుకు సాగుతుందని వెల్లడించారు. విప్లవ జ్యోతికి తన పక్షాన, జనసైనికుల పక్షాన నివాళులు అర్పిస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపారు.
మోడీ పర్యటన
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటించారు. హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్నారు. రెండు రోజులు ఇక్కడ.. ఏపీలో ఒకరోజు పర్యటన చేశారు. తర్వాత ఢిల్లీకి వెళ్లారు. ఇదీ ముమ్మాటికీ ఎన్నికల స్టంటే అని విపక్షాలు అంటున్నాయి. మోడీకి సీతారామరాజు ఇప్పుడు గుర్తొచ్చారా అనే వారు చాలా మంది ఉన్నారు. మరీ దీనికి సంబంధించి బీజేపీ ఎలా కౌంటర్ అటాక్ చేయనుందో చూడాలీ మరీ.