సమ్మె నోటీసు తథ్యం.. ఏపీ ఉద్యోగ సంఘాల స్పష్టీకరణ
పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. పీఆర్సీ గురించి ఏపీ ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య గొడవ జరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. రెండో రోజు ముఖ్యమంత్రి జగన్తో మాట్లాడే అవకాశమే తమకు రాలేదని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చెప్పారు. పీఆర్సీపై సీఎం ఒక ప్రకటన చేసి వెళ్లిపోయారని.. ప్రభుత్వంతో తమకు ఎలాంటి ఒప్పందం లేదని, తాము ఎక్కడా సంతకాలు పెట్టలేదని చెప్పారు.

తగ్గిన జీతాలు
పీఆర్సీ వల్ల ఉద్యోగుల జీతాలు పెరగాలే కానీ, తగ్గవని అన్నారు. తమను ఇంత మోసం చేస్తారా? అని అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ స్కేల్తో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం పేరుతో ఉద్యోగులను సంక్షోభంలోకి నెడతారా? అని అడిగారు. పీఆర్సీ ఇవ్వాల్సినప్పుడల్లా ప్రభుత్వాలు ఆదాయం లేవనే చెపుతాయని... రాష్ట్ర విభజన వల్ల ఆర్థికలోటు ఉన్నా గత ప్రభుత్వం 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు.

ఆదాయం పెరిగితే
రాష్ట్ర ఆదాయం భారీగా పెరిగిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పారని... మరి, ఆయన అబద్ధాలు చెప్పారని అనుకోవాలా? అని మండిపడ్డారు. ఇంతకుముందు విజయసాయిరెడ్డి రెడ్డి చేసిన ట్వీట్ ను చూపించారు. ఇకపై మాటలు, చర్చలు ఉండవని... ఈ నెల 21 సమ్మె నోటీసు ఇస్తామని స్పష్టం చేశారు.

డీఏ..
అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలను ఏపీ సర్కార్ విడుదల చేసింది. 2019 జూలై నుంచి 2021 డిసెంబర్ 31 వరకు పెండింగ్లో ఉన్న అన్ని డీఏలను విడుదల చేసింది. ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటన మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులపే ఇచ్చింది. పీఆర్సీకి సంబంధించి 23 శాతం ఫిట్మెంట్ అమలు చేస్తూ మరో జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్ 1, 2020 నుంచి మోనిటరీ బెనిఫిట్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్న సంగతి తెలిసిందే.

అప్పుడే ఉత్తర్వులు
ప్రభుత్వ ఉద్యోగులకు 2019 జూలై ఒకటి నుంచి డీఏ బకాయిలను విడుదల చేయడానికి ఆర్దికశాఖ డిసెంబర్ లోనే అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. నెలకు 5.24 శాతం డీఏ బకాయిలు విడుదల చేయాలని ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. తాజాగా దీనిపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఇటీవలే అందించారు. ఉద్యోగులు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్న పీఆర్సీతోపాటు.. కీలక వరాలు కురిపించారు. గత కొంతకాలంగా వివాదంగా మారిన పీఆర్సీని ప్రకటించారు. 23 శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్టు చెప్పారు.

అదనంగా 10 శాతం పెన్షన్
70 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్న పెన్షనర్లకు అదనంగా 10 శాతం పెన్షన్ ఇవ్వాలని కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. పెండింగ్లో ఉన్న5 డీఏలు వెంటనే చెల్లించాలన్నారు. ముఖ్యంగా సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే సీపీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు భత్యాలు కొనసాగించాలని విజ్జప్తి చేశారు. వీటితో పాటు ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1993 నుంచి పనిచేస్తున్న కంటింజెంట్, ఒప్పంద సిబ్బందిని క్రమబద్దీకరించాలని కోరింది.. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెబుతున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది.. ఈ నిర్ణయం వల్ల ఏటా ఖజానాపై 10 వేల 247 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. కానీ దీనిపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి.












Click it and Unblock the Notifications