చంద్రబాబుకు ఎందుకు నోటీసులు అంటే.. వర్ల రామయ్య వెర్షన్ ఇదీ..
అమరావతి భూముల అంశంలో చంద్రబాబుకు సీఐడీ నోటీసులు పంపడంపై దుమారం రేగింది. దీనిపై టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జగన్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని, హాజరుకాకపోతే అరెస్ట్ తప్పదని సీఐడీ చంద్రబాబును హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిని వర్ల రామయ్య తప్పుపట్టారు.
సైంధవుడి పాత్రే చంద్రబాబుది ; ఎంపీ సాయిరెడ్డి ట్వీట్ .. ఏ2 శకుని అట్టహాసమంటూ వర్ల రివర్స్ అటాక్
పాలన చేపట్టిన రెండేళ్ల తర్వాత కళ్లు తెరిచారా అని అడిగారు. నోటీసులు ఇవ్వడానికి ఇన్నిరోజులు పట్టిందా అని అడిగారు. త్వరలో జగన్, విజయసాయి బెయిళ్లు రద్దు కాబోతున్నాయని వర్ల రామయ్య అన్నారు. సీఎం జగన్ వెన్నులో వణుకు పుట్టించే పనిలో సీబీఐ ఉందని పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో అసలు ముద్దాయిని త్వరలోనే పట్టుకుంటారని, ఈ కేసులో జగన్ ఇరుక్కునే అవకాశం ఉందని వర్ల వివరించారు.
ఈ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబుకు సీఐడీ ద్వారా నోటీసులు పంపారని ఆరోపించారు. ఇడుపులపాయలో దళితులకు అన్యాయం చేసింది మీ కుటుంబమే అంటూ సీఎం జగన్ను విమర్శించారు. అసైన్డ్ భూములను ఆధీనంలోకి తీసుకున్నది ఎవరో అందరికీ తెలుసని అన్నారు. 690 ఎకరాల దళితుల భూములను సాగుచేశామని ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంగీకరించారని వెల్లడించారు.