డబ్బులు చెల్లించరా..? హైకోర్టు చెప్పినా లెక్కలేనితనమా...: చంద్రబాబు
సమయం దొరికితే చాలు ఏపీ ప్రభుత్వం విధానాలపై ఒంటికాలిపై లేస్తారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. విధానపర తప్పుడు నిర్ణయాలను తూర్పార పడుతుంటారు. ఈ సారి కూడా అదేవిధంగా ఫైరయ్యారు. ఉపాధి హామీ పథకం చెల్లింపులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. హైకోర్టు ఆదేశించినా.. కాంట్రాక్టర్లకు ఎందుకు చెల్లింపులు చేయడంలేదని మండిపడ్డారు. గ్రామాలను అభివృద్ధి చేసిన కాంట్రాక్టర్లపై కక్ష సాధింపు ఏమిటని ప్రశ్నించారు. ఇదీ మంచి పద్దతి కాదని హితవు పలికారు.
గ్రామాలను అభివృద్ధి చేసిన కాంట్రాక్టర్లలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. వారిని ఆర్థికంగా అణగదొక్కేందుకు ప్రయత్నించడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ.80 వేల కోట్ల మేర బకాయి పడిందని ఆరోపించారు. ఈ డబ్బులు చెల్లించేది ఎప్పుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిరోజులు ఎదురు చూడాలని కోరారు. వెయిట్ చేయించడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని సూచించారు.
జగన్ సర్కార్ విధానాలతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు రావడంలేదని తెలిపారు. అభివృద్ధి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని వెల్లడించారు. బిల్లులు చెల్లించకుండా వేధించడంతో ఏలూరులో కాంట్రాక్టర్ రంజిత్ సూసైడ్ అటెంప్ట్ చేశాడని చంద్రబాబు తెలిపారు. రంజిత్కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. కాంట్రాక్టర్లు ఎవరూ ఆందోళనతో ఆత్మహత్యాయత్నం చేయొద్దని చంద్రబాబు నాయుడు సూచించారు. వారికి తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు.
ఉపాధి హామీ పనుల బకాయిలకు సంబంధించి ప్రతి పైసా అందేవరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. కూలీల హక్కుల కోసం పోరాటం చేస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. వారికి న్యాయం జరిగే వరకు తమ పోరుబాట కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇటు కాంట్రాక్టర్లకు కూడా బిల్లు మంజూరు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. వారి కుటుంబం ఎన్నాళ్లూ బాధలు పడాలని అడిగారు. చేసిన పనికి డబ్బులు ఇవ్వకుండా ఆపివేయడం కరెక్టు కాదని చెప్పారు. జగన్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే పరిస్థితి ఇలా దాపురించిందని చెప్పారు.