ప్రజాస్వామ్యంలో మంచిది కాదు.. దాడులపై రెబల్ ఎంపీ రఘురామ
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కార్యాలయాలు, ఇళ్లపై జరిగిన దాడులను రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి. అధినేతలు/ నేతలు ముక్తకంఠంతో దాడి వైఖరిని తప్పుపడుతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఖండించిన సంగతి తెలిసిందే. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఖండించారు. టీడీపీ కార్యాలయాలపై ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపైనా దారుణరీతిలో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ దాడికి పాల్పడినవారు పట్టాభి కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా దూషించినట్టు తెలిసిందని రఘురామ పేర్కొన్నారు. కారకులు ఏ పార్టీకి చెందినవారైనా సరే డీజీపీ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే వారిని అరెస్ట్ చేయాలని రఘురామ డిమాండ్ చేశారు. నేతల మీద, పార్టీ కార్యాలయాల మీద ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి భంగకరం అని తెలిపారు.
మరోవైపు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగిన సంఘటనలు విషాదకరం అని అభివర్ణించారు. ఇలాంటి దమనకాండకు పాల్పడిన వ్యక్తులపై జగన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని ఏపీ బీజేపీ తరఫున డిమాండ్ చేశారు.
అంతకుముందు టిడిపి కేంద్ర కార్యాలయం పై వైసిపి నాయకులు దాడి నేపథ్యంలో జాతీయ రహదారిపై టిడిపి శ్రేణులు ఆందోళనకు దిగారు. విశాఖ, తిరుపతి, గుంటూరులోని టిడిపి కార్యాలయాలపైన వైసీపీ శ్రేణుల దాడులు కొనసాగుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు లోను టిడిపికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు టిడిపి నేత లింగారెడ్డి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి అమిత్ షా కు చంద్రబాబు ఫోన్ చేసి తమకు కేంద్ర బలగాల సహాయం కావాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై దాడులపై ఆయన గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశారు. దాడుల నేపథ్యంలో హై టెన్షన్ నెలకొంది. బుధవారం బంద్కు పిలుపునివ్వడంతో.. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.