అమరావతి తప్పంతా చంద్రబాబుదేనా ? ఇన్సైడర్ ట్రేడింగ్ నేతలను వదిలేయడం వెనుక ?
2019 ఎన్నికలకు ముందు విపక్షంలోని వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన ప్రభుత్వంలోని మంత్రులను టార్గెట్ చేస్తూ అవినీతి చక్రవర్తి పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించారు. అందులో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో పలు కుంభకోణాలు చేసిందని వీటి విలువ 6 లక్షల కోట్లు ఉంటుందంటూ ఊదరగొట్టారు. ఇందులో అమరావతి భూసేకరణ కూడా ఉంది. ఈ వ్యవహారంలో అప్పటి సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కేబినెట్ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలను చేర్చారు. తాము అధికారంలోకి వస్తే అమరావతి భూసేకరణలో చోటు చేసుకున్న స్కాంపై దర్యాప్తు జరిపించి దోషులను శిక్షిస్తామని చెప్పారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటికీ ఆ స్కాంలో వెలికి తీసింది లేదూ, శిక్షించిందీ లేదు. మరోవైపు ఈ వ్యవహారంలో చంద్రబాబును, ఆయన తనయుడు లోకేష్ను మాత్రమే టార్గెట్ చేసే వైసీపీ.. మిగతా టీడీపీ సీనియర్లను ఎందుకు వదిలేసిందనేది చర్చనీయాంశమవుతోంది.
అమరావతిపై అప్పట్లో వైసీపీ...
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అమరావతి రాజధాని భూసేకరణలో అక్రమాలు జరిగాయన్న పేరుతో అప్పట్లో విపక్ష వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసేది. అప్పట్లో టీడీపీ అధినేత, సీఎంగా ఉన్న చంద్రబాబు, మంత్రిగా ఉన్న ఆయన తనయుడు లోకేష్తో పాటు ఇతర మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలను టార్గెట్ చేసేది. ఇదే క్రమంలో అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ, టీడీపీ సీనియర్లు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రతో పాటు మరికొందరి పేర్లను వారు కొనుగోలు చేసిన భూముల ఆధారంగా బయటపెట్టింది. ఈ జాబితాలో ముందుగా మంత్రి నారాయణ అత్యధికంగా మూడు వేల ఎకరాల మేర భూములు కొనుగోలు చేసినట్లు వైసీపీ ఆరోపించేది.
ఆ తర్వాత పయ్యావుల ఆయన కుమారుడి పేరుతో రాజధానిలో భూములు కొన్నారని ఆరోపించేది. ధూళిపాళ నరేంద్రతో పాటు ఇతర నేతలను ఇందులోకి లాగింది.
చంద్రబాబు, లోకేష్ చుట్టూనే వైసీపీ...
గతంలో అమరావతి భూముల స్కాంలో చంద్రబాబు, లోకేష్ కంటే ఎక్కువగా ఆయన కేబినెట్ మంత్రులు, టీడీపీ సీనియర్లను టార్గెట్ చేసిన వైసీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం వారిని వదిలేసి చంద్రబాబు, లోకేష్ చుట్టూ ఆరోపణలు పరిమితం చేస్తోంది. చంద్రబాబు కుటుంబం పాత్ర ఉన్న అమరావతి స్కాంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కేంద్రాన్ని కోరుతోంది. ఓసారి అమరావతిపై దర్యాప్తు మొదలైతే అన్ని పేర్లు వస్తాయని అనుకున్నా చంద్రబాబు కుటుంబం మినహా మిగిలిన వారి పేర్లను కనీసం ప్రస్తావించేందుకు కూడా వైసీపీ ఇష్టపడటం లేదు. కనీసం ప్రెస్మీట్లలో సైతం వైసీపీ నేతలు చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం సెలక్టెడ్ టార్గెట్గా మారుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏసీబీ, సీఐడీ దర్యాప్తులోనూ అదే తీరు..
గతంలో అమరావతి భూముల స్కాంలో ఎవరి పాత్ర ఉందని వైసీపీ ఆరోపించిందో, ఎవరెవరు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని పుస్తకాలు అచ్చేసిందో ఇప్పుడు వారి పేర్లు కనీసం ఏసీబీ, సీఐడీ దర్యాప్తుల్లోనూ కనిపించడం లేదు. రాష్ట ప్రభుత్వ సంస్ధల దర్యాప్తు ప్రారంభమైన కొత్తలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరు మాత్రం వినిపించినా మిగతా వారి పేర్లు మాత్రం ఎక్కడా వినిపించడం లేదు, కనిపించడం లేదు. దీంతో వీరి విషయంలో వైసీపీ అభిప్రాయం మార్చుకుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు తగినట్లుగా వారు కూడా అమరావతి విషయంలో కొంతకాలంగా మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. దీంతో వీరి విషయంలో ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందా కేవలం రాజకీయ ఆరోపణలే అంటూ వదిలేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Recommended Video
టీడీపీ నేతల మౌనం అందుకేనా...
గతంలో వైసీపీ విపక్షంలో ఉండగా.. అమరావతి భూముల స్కాంలో ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి మంత్రి నారాయణ, పయ్యావుల కేశవ్, పల్లె రఘునాథరెడ్డి వంటి నేతలు కొంతకాలంగా మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో కేసులు ఎదుర్కొన్న మరో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు, లోకేష్పై వైసీపీ సర్కారులోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తున్నా వీరు మాత్రం ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. దీంతో వీరంతా ప్రభుత్వ పెద్దలతో రాజీ పడటం వల్లే వీరి పేర్లు వినపడటం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కూడా వీరితో అమరావతి వ్యవహారంపై మాట్లాడించేందుకు సిద్ధపడకపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి.