జేసీ దివాకర్రెడ్డిపై పోలీసుల ఫిర్యాదు . బూట్ల వ్యాఖ్యలపై కేసు నమోదు...
మాజీ ఎంపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల తీరుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు అయింది. జేసీ వ్యాఖ్యలపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన అనంతపురం పోలీసులు దివాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై 153,506 సెక్షన్ల క్రింద అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేశారు. కాగా ఇప్పటికే ఆయన వ్యాఖ్యలపై పలు ఫిర్యాదులు అందాయని వాటిపై విచారణ చేయనున్నట్టు స్థానిక పోలీసులు ప్రకటించారు.
బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటాను...
అనంతరం పార్టీ సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని, తాము అధికారంలో వచ్చిన తర్వాత బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. అదికూడ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేయడంతో సంచలనంగా మారాయి.
క్షమాపణలు చెప్పాలని పోలీసుల డిమాండ్
దీంతో జేసీ వ్యాఖ్యలపై అనంతరం జిల్లా పోలీసులు ఘాటుగా స్పందించారు. జేసి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక బూట్లు ఎవరు నాకారన్న విషయం రాష్ట్ర ప్రజలకు కూడ తెలుసని జేసీ దివాకర్ రెడ్డి హోదా, వయస్సు మరచి మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. మరోవైపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు వేదికపై ఉండికూడ స్పందించలేదని అన్నారు. భవిష్యత్లో ఇలాంటీ వ్యాఖ్యలు చేస్తే... మరిన్ని దారుణ పరిస్థితులు ఎదుర్కొంటారని పోలీసులు హెచ్చరించారు.
దిగిరాని జేసీ
జేసీ మాత్రం పోలీసుల డిమాండ్కు దిగిరాలేదు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.. తాను ఏ ఒక్క అధికారినో ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని... ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ఎలా ఉందో మాత్రమే చెప్పానని అన్నారు. పోలీసులు తమ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలీసు వ్యవస్థ గాడి తప్పితే సమాజానికి చేటని ఆయన ఆక్షేపించారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదని దివాకర్రెడ్డి హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.