పులివెందుల పక్కనే ధర్మవరం, నేతన్నల సమస్యలు తెలుసు, స్కాములమయంగా ఆప్కో: సీఎం జగన్
నేతన్నల ఇబ్బందుల తనకన్నా ఎక్కువ మరెవరికి తెలియవని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ధర్మవరం, పులివెందుల పక్క పక్క నియోజకవర్గాలని గుర్తుచేశారు. ధర్మవరంలో చేనేత కార్మికుల సమస్యలు ముందు తనకే వినిపించేవని చెప్పారు. తమ సమస్యల కోసం చేనేత కార్మికులు నిరహార దీక్ష కూడా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నేతన్నలకు తోడుగా ఉంటానని, మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి రూ.24 వేలు జమ చేస్తున్నామని చెప్పారు.

అడుగు అడుగులో..
పాదయాత్రలో ప్రతీ అడుగులో చేనేత పడిన కష్టాన్ని తెలుసుకున్నానని జగన్ పేర్కొన్నారు. ధర్మవరం, మంగళగిరి, చీరాల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పొందూరులో చేనేత కార్మికులు ఇబ్బందులను స్వయంగా చూశానని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ధర్మవరం సభా వేదికగా సీఎం జగన్ ఎండగట్టారు.

స్కాములమయంగా ఆప్కో
ఆప్కో వ్యవస్థను స్కాముల మయం చేశారని జగన్ విమర్శించారు. చేనేత కార్మికులకు భరోసానిచ్చే సంస్థను పచ్చ చొక్కాలు దోచుకున్నాయని ఆరోపించారు. దోపిడీ దర్యాప్తు తుది దశకు చేరిందని చెప్పారు. చేనేత కార్మికుల కోసం మంచి చేస్తున్నామని జగన్ చెప్పారు.

ఖాతాలో నగదు జమ
మగ్గం ఉన్న ప్రతీ చేనేత కుటుంబానికి ఇవాళే రూ.24 వేల నగదు వారి బ్యాంకు ఖాతాలో జమవుతుందని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హమీ మేరకు ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు. దీంతో 85 వేల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని జగన్ వివరించారు. ఆ నగదును అప్పుకింద జమచేసుకోవద్దని బ్యాంకు అధికారులకు కూడా సూచించినట్టు జగన్ పేర్కొన్నారు.

ఐదేళ్లలో రూ.1.20 లక్షలు
ఐదేళ్లు చేనేత కార్మికులకు నగదు జమచేస్తామని జగన్ వివరించారు. మొత్తం లక్షా 20 వేల అందజేసి, నేత కార్మికులకు ఆర్థికంగా భరోసా ఇస్తామని తెలిపారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాసులనీ జగన్ గుర్తుచేశారు. సమాజంలో వెన్నెముక కూలాలనీ ఏలూరు బీసీ గర్జనలో తాను చెప్పిన అంశాలను గుర్తుచేసుకున్నారు.

25 లక్షల మంది పేదలకు ఇళ్లు
వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటీగా నెరవేరుస్తున్నామని తెలిపారు. నవరత్నాలతో పేదలకు ప్రయోజనం కలుగుతుందని జగన్ చెప్పారు. 25 లక్షల మంది పేదలకు ఉగాది నాటికి పట్టాలు అందజేయబోతున్నామని వివరించారు. వచ్చేనెల 9వ తేదీన అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. వారి పిల్లలకు తాను చదివిస్తానని జగన్ హామీనిచ్చారు. వృద్ధులు పించన్ల కోసం గత ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయిస్తే తమ ప్రభుత్వం రూ.1500 కోట్ల నిధులను కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications