రాబోయే ఎన్నికలు చంద్రబాబుకన్నా ''జేసీ బ్రదర్స్'' కే అత్యంత కీలకం!!
జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. ఉన్నది ఉన్నట్లుగా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడతారు. మనసులో ఒకటి, బయటకు ఒకటి మాట్లాడరు. పార్టీలో అయినా అంతే.. మీడియా ముందైనా అంతే. ప్రస్తుతం వీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గత ఎన్నికల్లో అనంతపురం, తాడిపత్రి నుంచి తమ వారసులను రంగంలోకి దించి భంగపడ్డారు. ఎలాగైనా ఈసారి విజయం సాధించి తమ పేరును నిలబెట్టుకోవడంతోపాటు వారసులకు రాజకీయ వారసత్వాన్ని అందివ్వాలనే పట్టుదలతో ఉన్నారు.
కీలకంగా మారిన ఎన్నికలు
వీరికి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అయితే ఈసారి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ఎంత కీలకమో చంద్రబాబుకు తెలుసు. ఒక విషయంలో మాత్రం తాను స్పష్టంగా ఉన్నానని, ఈసారి ఎన్నికలకు తాను రిస్క్ చేయదలుచుకోలేదని, రాబోయే ఎన్నికల్లో దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ బరిలోకి దిగాల్సిందేనని చెప్పినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. 2019 ఎన్నికల్లో దివాకరరెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి అనంతపురం లోక్సభ నుంచి, ప్రభాకరరెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.
జేసీ సోదరులకు కూడా కఠిన పరీక్షే
రానున్న ఎన్నికలు చంద్రబాబుకే కాకుండా జేసీ సోదరులకు కూడా కఠిన పరీక్షే. గత ఎన్నికల్లో ఓటమి పాలవడాన్ని వీరిద్దరూ జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాపై పూర్తిస్థాయిలో పట్టు ఉండి, అన్ని పార్టీల నేతలతో సంబంధాలుండి తమ వారసులను గెలిపించుకోలేకపోయామనే గాయం వారిని వెన్నాడుతోంది. ప్రజల్లో తమ కుటుంబానికి ఉన్న మంచి పేరును వారసులకు అందించాలని చూస్తున్నారు. కానీ ఈసారికి మాత్రం బరిలోకి దిగాలని చంద్రబాబు స్పష్టం చేయడంతో దిగాలా? వద్దా? అనే ఆలోచనతో మల్లగుల్లాలు పడుతున్నారు.
ప్రస్తుతానికి మీరు గెలవండి..
రాయదుర్గం, శింగనమల, అనంతపురం అర్బన్, , కళ్యాణదుర్గం , పుట్టపర్తి తదితర నియోజకవర్గాల్లో జేసీ సోదరుల ప్రమేయం ఉంటుంది. ఈ నియోజకవర్గాల్లో తమ అనుచరులు, బంధువులకు టికెట్ల కోసం చంద్రబాబు దగ్గర సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలతో వివాదాలున్నాయి. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఈ కోణంలో టికెట్లు అడిగితే మాత్రం తాను ఏమీ చేయలేదని తనను అనుకోవద్దని, ఆ కోణం కాకుండా సాధారణంగా అడిగితే చూద్దామని, కానీ మీరు రంగంలోకి దిగే విషయంమీద దృష్టిపెట్టాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. దీనికి జేసీ సోదరులు కూడా సానుకూలంగానే అంగీకరించినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో వీరు బరిలోకి దిగుతారా? లేదంటే వారసులను రంగంలోకి దింపుతారా? తెలియాలంటే కొద్దిరోజుల ఆగక తప్పదు.!!