చిరంజీవిని చూస్తే బాధేసింది, జగన్కేనా ఇగో? పవన్ కళ్యాణ్కు ఉండదా?: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడతోందని మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రిలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమపై కక్ష సాధింపు వద్దని. అలా చేసి ఏం సాధిస్తారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్పై కక్ష సాధింపుతో సాధించేదేంటి?: జగన్పై జేసీ
తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ సర్కారు ఇదే విధంగా ప్రోత్సహిస్తే అక్కడే సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కక్ష సాధింపు చర్యల వల్ల ఏపీలో సినీ పరిశ్రమకు మనుగడ లేకుండా పోతోందన్నారు. అంతేగానీ, సినీ నటులకు ఎలాంటి నష్టం ఉండదని జేసీ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్పై కక్ష సాధింపు ద్వారా సాధించేది ఏమిటి? ఏ సినిమా తీసినా ఆయన రెమ్యూనరేషన్ ఆయనకొస్తుంది. ఏదైనా ఉంటే నేరుగా తేల్చుకోండి. సీఎం జగన్ తీసుకున్న చర్యల వల్ల పవన్ కళ్యాణ్ కు వచ్చిన నష్టమేమీ లేదన్నారు.
పవన్ కళ్యాణ్కు ప్రజల్లో మంచిపేరు: జేసీ ప్రభాకర్ రెడ్డి
ఏపీ సర్కారు ఆదేశాలతో ఎమ్మార్వోలు, పోలీసులు.. అంతా కలిసి థియేటర్లపై పడ్డారని, లా అండ్ ఆర్డర్ను పోలీసులు మర్చిపోయారని మండిపడ్డారు జేసీ ప్రభాకర్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారని గుర్తు చేశారు. తెలంగాణలోని సదుపాయాలను సినిమా వాళ్లు వినియోగించుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారని చెప్పారు. కేటీఆర్ హాజరవడంతో పవన్ కళ్యాణ్కి ప్రజల్లో మరింత మంచి పేరు వచ్చిందన్నారు.
జగన్కేనా ఇంగో ఉండేది? పవన్ కళ్యాణ్కు ఉండదా?: జేసీ ప్రభాకర్
ప్రతి ఒక్కరికీ ఇగో ఉంటుందన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. స్వతంత్రంగా కష్టపడి పైకి వచ్చిన పవన్ కళ్యాణ్ లాంటివారికి ఇంకా ఎక్కువగా ఉంటుందన్నారు. అయితే, అన్ని సందర్భాల్లో ఇది పనిచేయదన్నారు. సినీ పరిశ్రమను నాశనం చేయొద్దని, ఇది రాష్ట్ర మనుగడకు మంచిది కాదని ఏపీ సర్కారుకు జేసీ సూచించారు. ఏదైనా ఉంటే ప్రత్యక్ష చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ సీఎం యువకుడు, సత్తా ఉన్నవారన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. సినీ పరిశ్రమ విషయంలో ఇప్పటికైనా సీఎం జగన్ తన వ్యవహార శైలిని మార్చుకోవాలని హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డికేనా ఇగో ఉండేది. ఇగో.. అందరికీ ఉంటుందని తెలుసుకోవాలి. వీలుంటే మంచి పనులు చేసి ప్రజల మెప్పు పొందాలి. సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలు ఆపాలి. సీబీఐ అధికారుల మీద కూడా కేసులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరూ ఉండకూడదా? ఈ రోజు చెబుతున్నా.. ఏ ఒక్క డైరెక్టర్ కూడా ఏపీకి వచ్చి షూటింగ్ చేయరు అని జేసీ ప్రభాకర్ అన్నారు.
Recommended Video
జగన్ ముందు చిరంజీవి చేతులు జోడించాలా?: జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్
ప్రముఖ సినీనటుడు చిరంజీవిని చూస్తే ఏడుపొచ్చిందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కింది స్థాయి నుంచి స్వయం కృషితో పైకొచ్చిన వ్యక్తి చిరంజీవి అని.. అలాంటి వ్యక్తి దీనాతి దీనంగా చేతులు జోడించి మిమ్మల్ని(జగన్)ను అడిగారు. ఆ పరిస్తితికి ఎవరికీ రావొద్దు. చిరంజీవి కూడా మిమ్మల్ని చేతులు జోడించి ప్రాధేయపడాలా? ఆయనకు ఏం తక్కువ? చేతులు జోడించి అడిగారంటే ఆయన బతుకుదెరువు కోసం కాదు.. ఆయన్ను పైకి తెచ్చిన సినిమా ఇండస్ట్రీ కోసం అడిగారు. నిన్ను(జగన్)ను ఎవరూ క్షమించరు. సినిమా ఇండస్ట్రీపై కక్ష సాధిస్తే.. థియేటర్ వద్ద పల్లీలు అమ్మే వ్యక్తి నుంచి లైట్ బాయ్ వరకు అందరూ అంధకారంలోకి వెళ్లిపోతారని, వారి భవిష్యత్ నాశనమైపోతుందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సినిమా టికెట్ ధరలను తగ్గించిన నేపథ్యంలో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు సీఎం జగన్ను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి చేతులు జోడించి సీఎం జగన్కు సినీ పరిశ్రమ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సినిమా టికెట్ ధరలు మళ్లీ సవరిస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఏపీ సర్కారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే, పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లానాయక్ సినిమా వచ్చే శుక్రవారం విడుదలవుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఐదు షోలకు అనుమతివ్వగా.. ఏపీలో మాత్రం అలాంటి అవకాశం లేదు. టికెట్ ధరలు పెంచుకునే వీలు కూడా లేదు.