ఆ జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది - రంగంలో దిగిన ట్రబుల్ షూటర్..!!
అనంతపురం: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్యకాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయంగా ఇబ్బందికర పరిణామాలను సృష్టిస్తోన్నట్టే కనిపిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంటోందనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది. వైఎస్ఆర్సీపీ-టీడీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతుండటం ప్రజల్లో కొంత వ్యతిరేకతను పెంచుతోందనే అభిప్రాయాలు ఉన్నాయి.

వాగ్యుద్ధాలతో..
మొన్నటికి మొన్న రాప్తాడు నియోజకవర్గం పరిధిలో వైసీపీ-టీడీపీ నాయకుల మధ్య చోటు చేసుకున్న వివాదం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు రాప్తాడు శాసన సభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి. ఇది పరిటాల కుటుంబాన్ని తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయాల్సి వచ్చింది.

క్షేత్రస్థాయిలో..
అటు తాడిపత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికే పట్టణంపై టీడీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఇది స్పష్టమైంది కూడా. జేసీ కుటుంబం తన పట్టు నిలుపుకొందా ఎన్నికల్లో. కల్యాణదుర్గం, రాయదుర్గంలల్లో ఎమ్మెల్యేలపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉందనే నివేదికలు సైతం వైసీపీ అగ్ర నాయకత్వానికి అందినట్లు చెబుతున్నారు. కల్యాణదుర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న మంత్రి ఉషా శ్రీచరణ్ అనుచరులపై ఇదివరకు కబ్జా ఆరోపణలు చేశారు స్థానిక టీడీపీ నాయకులు.

ఉమ్మడి అనంతపురంపై..
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఉమ్మడి అనంతపురం కూడా ఒకటి. ఉమ్మడి అనంతపురంలో మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. టీడీపీకి దక్కింది- రెండే. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ విజయం సాధించారంతే. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత ఈ రెండు నియోజకవర్గాలు అటొకటి ఇటొకటి అయ్యాయి. ఉరవకొండ అనంతలో కొనసాగుతుండగా.. హిందూపురం శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా పరిధిలోకి వచ్చింది.

టీడీపీకి వెన్నుదన్నుగా..
నిజానికి ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి ముందు నుంచీ వెన్నుదన్నుగా ఉంటూ వస్తోంది. 2014లో ఉరవకొండ, కదిరి మినహా అన్ని స్థానాల్లోనూ టీడీపీ జెండా ఎగిరింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులను తీసుకుని రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోన్నారు చంద్రబాబు. దీనికి అనుగుణంగా వ్యూహాలను పన్నుతున్నారు. తానే స్వయంగా అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నారనేది జిల్లా రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారం.

రంగంలో దిగిన ట్రబుల్ షూటర్..
ఈ పరిణామాల మధ్య వైసీపీ సీనియర్ నాయకుడు, అటవీ-విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రంగంలో దిగారు. అనంతపురం జిల్లాలో నియోజకవర్గ సమీక్షలకు పూనుకున్నారు. రోజూ రెండు నియోజకవర్గాల చొప్పున సమీక్ష సమావేశాలను నిర్వహించనున్నారు. మండల స్థాయిలో వైసీపీ నాయకులను కలుసుకోనున్నారాయన. పార్టీ స్థితిగతులపై నివేదికలను తెప్పించుకోనున్నారు.

ఎల్లుండి నుంచే..
ఎల్లుండి నుంచే ఈ నియోజకవర్గ స్థాయి సమీక్షలను చేపట్టనున్నారు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఉషా శ్రీచరణ్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కళ్యాణ దుర్గం నుంచే దీనికి శ్రీకారం చుట్టనున్నారు. 9వ తేదీన కల్యాణదుర్గం, రాయదుర్గం,10వ తేదీన గుంతకల్లు, ఉరవకొండ,11వ తేదీన తాడిపత్రి, శింగనమల,12వ తేదీన రాప్తాడు, అనంతపురం నియోజకవర్గ స్థాయి నాయకులతో సమావేశమౌతారు. ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.












Click it and Unblock the Notifications