ఎవరండీ నారా లోకేష్- సర్పంచా? వార్డ్ మెంబరా?- హు ఈజ్ హి..!!
అనంతపురం: అనంతపురం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్రను విజయవంతం చేయడంపై దృష్టి సారించాయి. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి ఇప్పటి నుంచే సన్నాహాలను మొదలు పెట్టాయి.
సుదీర్ఘ పాదయాత్ర..
అటు నారా లోకేష్- తన సుదీర్ఘ పాదయాత్రకు సమాయాత్తమౌతోన్నారు. యువ గళం పేరుతో కాలినడకన రాష్ట్రాన్ని చుట్టేయనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు సుమారు 4,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారాయన. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్రను ప్రారంభించనున్నారు.
టీడీపీని..
2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నారా లోకేష్.. ఈ యువ గళం పాదయాత్రను చేపట్టారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, రోడ్లు.. వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో పేరుకుపోయాయని భావిస్తోన్న సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు నారా లోకేష్.
తోపుదుర్తి కీలక వ్యాఖ్యలు..
ఈ నేపథ్యంలో- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విలేకరుల సమావేశంలో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ప్రస్తావన రాగా- ఆయన ఘాటుగా స్పందించారు. నారా లోకేష్ పాదయాత్ర జిల్లా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం పడుతుందంటూ విలేకరులు ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ విజయావకాశాలను ఈ పాదయాత్ర ప్రభావితం చేస్తుందా? అని ప్రశ్నించారు.
నారా లోకేష్ ఎవరు?..
నారా లోకేష్ పాదయాత్రను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారు. నారా లోకేష్ ఎవరండి? హు ఈజ్ లోకేష్.. అని ప్రశ్నించారు. ఎప్పుడైనా అసెంబ్లీకి ఎన్నికయ్యారా? పంచాయతీ సర్పంచ్ అయ్యారా? వార్డ్ మెంబర్ అయ్యారా?.. అని విలేకరులకు ఎదురు ప్రశ్నలు వేశారు. నామినేట్ చేస్తే పదవిలోకి వచ్చారు. ఆయన గురించి మేమేంది ఆలోచన చేసేది.. అని తేల్చి చెప్పారు.
వైసీపీ నాయకులు కూడా..
యువ గళం పాదయాత్ర వల్ల వైఎస్ఆర్సీపీ విజయావకాశాలు ఏ మాత్రం తగ్గబోవని అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. పాదయాత్రలో ఆయన ఎలాంటి అంశాలు లేవనెత్తుతారని ప్రశ్నించారు. పాదయాత్రలో ప్రస్తావించడానికి ఎలాంటి అంశాలు లేవని స్పష్టంచేశారు. తమ ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థలను రద్దు చేస్తానని నారా లోకేష్ చెప్పగలరా? అంటూ సవాల్ చేస్తోన్నారు.