ఏపీలోకి భారత్ జోడో యాత్ర ఎంట్రీ, రాహుల్ కు గ్రాండ్ వెల్ కం పలికిన నేతలు
కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలం కనుక్కుప్పకు చేరింది. అక్కడి నుంచి పాదయాత్ర కొనసాగనుంది. రాహుల్ గాంధీకి శైలజానాథ్, రఘువీరారెడ్డి, తులసిరెడ్డి స్వాగతం పలికారు.
రాహుల్ గాంధీ పాదయాత్ర జాజురకల్లు, మడేనహళ్లి, లక్ష్మీపురం, డి హీరేహాల్, ఓబులాపురం, ఓబులాపురం చెక్పోస్ట్ మీదుగా పాదయాత్ర సాగనుంది. ఇవాళ 12 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్బంగా పోలీస్ గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 12 కిలోమీటర్లను పూర్తిగా పోలీసు కనుసన్నల్లో ఉండేలా ఆంధ్రా - కర్ణాటక పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. బళ్లారి - బెంగళూరు హైవేలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు శ్రీకారం చుట్టారు. రాహుల్ పాదయాత్రకు ఆశించిన మేర రెస్పాన్స్ వస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నంలో ఉన్నారు. మోడీ ప్రభుత్వం చేసిన చర్యలను పాదయాత్రలో వివరిస్తూ వస్తున్నారు. ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టలేదని ఆరోపణలు చేస్తున్నారు.
70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్నారు. ఏ ఒక్క రంగాన్ని కూడా వదలడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. ఏపీలో 5 రోజుల పాటు రాహుల్ జోడో యాత్ర సాగనుంది. ఈ నెల 24వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. అనంతపురం జిల్లా జాజిరకల్లు టోల్ ప్లాజా వద్ద పాదయాత్ర ఆగుతుంది. అక్కడే రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకుంటారు.