ఏపీలో కరోనా కలకలం: కొత్తగా 1288 కేసులు, గుంటూరులో అత్యధికం, పెరిగిన యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,116 నమూనాలను పరీక్షించగా.. 1,288 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,04,548కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో భారీగా పెరిగిన యాక్టివ్ కేసులు..
గత 24 గంటల్లో కరోనా బారినపడి విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7,225 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 610 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,88,508కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో భారీగా పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,815 యాక్టివ్ కేసులున్నాయి.
గుంటూరులో అత్యధికంగా కొత్త కరోనా కేసులు
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,51,46,104 కరోనా నమూనాలను పరీక్షించారు. గత 24 గంటల్లో గుంటూరులో 311, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో 1288 మొత్తం కొత్త కరోనా కేసుల్లో 1009(78శాతం) కేసులు కేవలం ఐదు జిల్లాల్లోనే నమోదు కావడం గమనార్హం.
ఏపీలో జిల్లాల వారీగా పెరిగిన కొత్త కరోనా కేసులు..
ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 26, చిత్తూరులో 225, తూర్పుగోదావరిలో 26, గుంటూరులో 311, కడపలో 21, కృష్ణాలో 164, కర్నూలులో 52, నెల్లూరులో 118, ప్రకాశంలో 62, శ్రీకాకుళంలో 54, విశాఖపట్నంలో 191,
విజయనగరంలో 31, పశ్చిమగోదావరిలో 7 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశ వ్యాప్తంగానూ భారీగా పెరిగిన కేసులు
దేశ వ్యాప్తంగానూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 11,13,966 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 81,466 కొత్త కేసులు వెలుగుచూశాయి. సుమారు ఆరు నెలల తర్వాత ఈస్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,23,03,131కి చేరింది. గత 24 గంటల్లో 469 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,63,396కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 50,356 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడ్డవారి సంఖ్య 1.15 కోట్లు దాటింది. ప్రస్తుతం దేశంలో 6,14,696 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, గత 24గంటల వ్యవధిలో మహారాష్ట్రలో 43,183 కరోనా కేసులు, 249 మరణాలు సంభవించడం గమనార్హం. ఒక్క ఈ రాష్ట్రంలోనే 3,67,897 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.