ఏపీలో కరోనా కల్లోలం: ఒక్కరోజే 10వేలకుపైగా పాజిటివ్ కేసులు, 65 మంది మృతి, జిల్లాల వారీగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లో గత రికార్డులను బ్రేక్ చేస్తూ 10వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఒక్కరోజే 10వేలకుపైగా కరోనా కేసులు
రాష్ట్రంలో గత 24 గంటల్లో 70,584 నమూనాలను పరీక్షించగా 10,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,390కి చేరింది. బుధవారం కరోనా నుంచి 2784 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు మొత్తం 55,406 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

కొత్తగా 65 మంది మృతి..
కరోనా ఆస్పత్రుల్లో ప్రస్తుతం 63,771 మంది చికిత్స పొందుతున్నారు. బుధవారం అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1676 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో మరో 65 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1213కు చేరింది.

జిల్లాలవారీగా మరణాలు..
గత 24 గంటల్లో మరణించినవారి వివరాలు జిల్లాల వారీగా.. తూర్పుగోదావరిలో 14, అనంతపురం , విజయనగరం 7, చిత్తూరు 6, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో నలుగురు చొప్పున, గుంటూరు, కడపలో ముగ్గురు చొప్పున, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరే మరణించారు. కాగా, ఇప్పటి వరకు 18,20,009 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు..
ఇక జిల్లాలవారీగా కొత్త కేసులను గమనించినట్లయితే అనంతపురం 1371, చిత్తూరు 819, తూర్పుగోదావరి 1676, గుంటూరులో 1124, కడప 734, కృష్ణా 259, కర్నూలులో 1091, నెల్లూరులో 608, ప్రకాశం 242, శ్రీకాకుళం 496, విశాఖపట్నం 841, విజయనగరం 53, పశ్చిమగోదావరి జిల్లాలో 779 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం నాల్గవ స్థానంలో ఉంది. లక్షా32వేల కేసులతో మూడోస్థానంలో ఉన్న ఢిల్లీని త్వరలోనే ఏపీ అధిగమించే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications