భారీగా కరోనా కేసులు, 4 లక్షలకు చేరువలో.. తమిళనాడును దాటనున్న ఏపి, రెండో స్థానం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కొంచెం తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ.. బుధవారం 10వేలకుపైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం కూడా ఏమాత్రం తగ్గకుండా 10వేల కంటే ఎక్కువే కొత్తగా కరోనా కేసులు వెలుగుచూశాయి. కరోనా పరీక్షలు పెంచుతున్న క్రమంలో కొత్త కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి.
ఏపీలో 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు
తాజాగా, గత 24 గంటల్లో 61,300 నమూనాలను పరీక్షించగా వారిలో 10,621 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,93,090కు చేరింది. ఇక 8528 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 34,79,990 కరోనా కేసులు నమోదయ్యాయి.
92 మంది మృతి.. కర్నూలులో అత్యధికం..
గత 24 గంటల్లో కరోనా బారినపడిన 92 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 13 మంది, నెల్లూరులో 11, తూర్పుగోదావరిలో 10, చిత్తూరులో 9, కడపలో 7, పశ్చిమగోదావరిలో 7, అనంతపురంలో 6, ప్రకాశంలో 6, విశాకపట్నంలో 6, గుంటూరులో 5, కృష్ణాలో 4, శ్రీకాకుళంలో 4, విజయనగరం జిల్లాలో నలుగురు చొప్పున మరణించారు. దీంతో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 3633కి చేరింది.
తూర్పుగోదావరి, ప్రకాశంలో వెయ్యిదాటిన కొత్త కేసులు
తాజాగా నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లోనే నమోదయ్యాయి. జిల్లాల వారీగా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 815, చిత్తూరులో 928, తూర్పుగోదావరిలో 1089, గుంటూరులో 926, కడపలో 844, కృష్ణాలో 316, కర్నూలులో 855, నెల్లూరులో 934, ప్రకాశంలో 1020, శ్రీకాకుళంలో 846, విశాఖపట్నంలో 593, విజయనగరంలో 563, పశ్చిమగోదావరిలో 892 కరోనా కేసులు నమోదయ్యాయి.
తమిళనాడును దాటనున్న ఏపీ.. దేశంలో రెండో స్థానంలో
దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో 7,18,711, తమిళనాడులో 3,97,261 ఉన్నాయి. ఆ తర్వాత 3,93,090 కేసులతో మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే, త్వరలోనే తమిళనాడును వెనక్కి నెట్టి ఏపీ రెండో స్థానంలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే యాక్టివ్ కేసులో రెండో స్థానంలో కొనసాగుతోంది ఏపీ. మహారాష్ట్రంలో 1,72,873 యాక్టివ్ కేసులుండగా, 94,209 యాక్టివ్ కేసులతో రెండో స్థానంలో ఉంది.