‘పవన్’ గొడవ: 10మంది ఫ్యాన్స్ అరెస్ట్, పీఎస్ ఎదుట ఆందోళన, ఫ్లెక్సీల తొలగింపు
పశ్చిమగోదావరి: జిల్లాలోని భీమవరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల మధ్య మూడు రోజుల క్రితం మొదలైన ‘ఫ్లెక్సీ' గొడవ నేపథ్యంలో భీమవరంలో పోలీసులు 144 సెక్షన్ నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నారు.
అయితే పెచ్చరిల్లిన అల్లర్లను చల్లార్చే క్రమంలో పోలీసులు 10మంది పవన్ కల్యాణ్ అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ పవన్ కల్యాణ్ అభిమానులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
దీంతో శనివారం ఉదయం భీమవరంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అసలు నిందితులను అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వందల మంది పవన్ అభిమానులు ర్యాలీలు తీశారు.

గొడవల నేపథ్యంలో పోలీసులు భీమవరంలో ప్రధాన రహదారులపై పెట్టిన సినీ హీరోలకు సంబంధించిన అన్ని ఫ్లెక్సీలను తొలగించారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోని ఉందని పోలీసులు చెప్పారు.
కాగా, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడితో పాటు, ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కూడా ప్రకటించారు. అయితే పవన్ ఫ్లెక్సీలను చించేసిన అసలు నిందితులను అరెస్ట్ చేశాకే చర్చలకు సహకరిస్తామని భీమవరం పవన్ అభిమానులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications