APలో కొత్తగా మరో 10 బ్రాండ్లు
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 10 బ్రాండ్ల మద్యం అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వీటికి అనుమతులిచ్చింది. ప్రస్తుతం ఏపీలో అందుబాటులో ఉన్న కొన్ని కేటగిరీల బీరు సీసా ధర రూ.200. ఇప్పుడు కొత్తగా అనుమతిచ్చిన బ్రాండు బీరు సీసా ధర రూ.220గా నిర్ణయించారు.
క్వార్టర్ మద్యం సీసా రూ.110 కాగా, ఇప్పుడు కొత్తగా అనుమతిచ్చిన బ్రాండ్ల మద్యం సీసా రూ.130గా ఉంది. తమిళనాడుకు చెందిన ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్ లిమిటెడ్ సంస్థతోపాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు చెందిన కొత్త బ్రాండ్లకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
మద్య నిషేధాన్ని అమలు చేసే క్రమంలో ప్రభుత్వం ముందుగా మద్యం ధరలు భారీగా పెంచింది. దీనివల్ల ప్రజలు మద్యం అలవాటు నుంచి దూరం జరుగుతారని ప్రభుత్వం భావించింది. ధరలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో కొందరు నాటు సారా తయారీకి ఉపక్రమించారు.
ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు ఎక్కడికక్కడ దాడులుచేస్తూ నాటుసారా తయారీదారులను అరెస్ట్ చేస్తున్నారు. ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే మిన్న అని చెబుతున్న ప్రభుత్వం రానున్న రోజుల్లో సంవత్సరానికి 20 శాతం చొప్పున మద్యం దుకాణాలను తగ్గించుకుంటూ రాబోతోంది. తర్వాత కేవలం స్టార్ హోటల్స్ లో మాత్రమే మద్యం అందుబాటులో ఉండేలా చూడబోతోంది.