ఈ ఘనత దేశానికి గర్వకారణం: ప్రధాని నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
హైదరాబాద్: 100 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయడం దేశానికి ఎంతో గర్వకారణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇది సాధ్యమైందని, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు పవన్ కళ్యాణ్. ఆరోగ్య సిబ్బందితోపాటు కరోనా వారియర్లందరికీ పవన్ శుభాకాంక్షలు తెలిపారు.
100 కోట్ల మార్క్ దాటడం ప్రతి ఒక్కరం హర్షించాల్సిన విషయం. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ విజయం సాధించడం గర్వకారణం. గడిచిన ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్నే కాకుండా భారతదేశాన్ని కూడా ఓ కుదుపు కుదిపేసింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కరోనా విజృంభణతో దేశంలో కోట్లాది మంది చనిపోతారని, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కొందరు నిపుణులు కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిన్నింటినీ దాటుకుని కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయడంతోపాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ 100 కోట్ల మార్క్ దాటింది. ఈ ఘనతకు కారకులైన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఆరోగ్య సిబ్బంది, వైద్యులు, వైరాలజిస్టులు, నిపుణులు, కరోనాపై పోరులో ముందున్నవారందరికీ శుభాకాంక్షలు తెలిపారు పవన్ కళ్యాణ్.
కాగా, భారత్ గురువారం ఉదయం నాటికి 100 కోట్ల టీకాలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. చైనా తర్వాత 100 కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భారత్ రికార్డుల్లోకెక్కింది. దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఈ ఏడాది జనవరి 16న టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి దశలో కరోనా పోరులో ముందున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు టీకాలు వేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడినవారికి, మే 1 నుంచి 18 ఏళ్లు పైబడినవారిందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఇటీవల కరోనా టీకాల ఉత్పత్తి పెరగడంతో పంపిణీ వేగం పెరిగింది. ఈ క్రమంలోనే గురువారం నాటికి 100 కోట్ల మందికిపైగా కరోనా టీకాలు పంపిణీ చేశారు. ఇక 30 కోట్ల మందికిపైగా రెండు డోసులను అందించారు.
Recommended Video
100 కోట్ల డోసులు పంపిణీ చేసి సరికొత్త చరిత్రను సృష్టించామని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇది ప్రజలందరి విజయమని వ్యాఖ్యానించారు. కాగా, దేశంలో కోవిడ్ టీకా పంపిణీ వంద కోట్లు దాటిన సందర్భంగా గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రత్యేక గీతాన్ని, ఏవీ(ఆడియో-విజువల్)ని విడుదల చేశారు. గురువారం ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరయ్యారు. వ్యాక్సినేషన్కు సహకరించిన వారికి శతకోటి వందనాలు అంటూ పాడిన ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. 'టీకే సే బచా హై దేశ్' అంటూ సాగే ఈ పాటను..ప్రఖ్యాత గాయకుడు కైలాశ్ ఖేర్ ఆలపించారు. 100 కోట్ల వ్యాక్సినేషన్ మార్క్ ఘనత సాధించి భారత్ చరిత్ర సృష్టించిందని మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. స్వయం సమృద్ధ భారతదేశానికి ఇది దీపావళి పండగ వంటిదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications