33 ఏళ్ల తర్వాత మళ్లీ తిరుపతిలో: సుజనా, 9 మంది నోబెల్ గ్రహీతలు వస్తారు
తిరుపతి/న్యూఢిల్లీ: తిరుపతిలో 33 ఏళ్ల తర్వాత మరోసారి ఇండియన్ కాంగ్రెస్ సైన్స్ జరగనుంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి సోమవారం నాడు ఢిల్లీలో చెప్పారు. దీనికి సుమారు 9 మంది నోబెల్ గ్రహీతలు హాజరవుతారని ఆయన తెలిపారు. 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లపై తొలి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
అనంతరం సుజన మీడియాతో మాట్లాడారు. 2017 జనవరి 3 నుంచి 7 వ తేదీ వరకు జరిగే ఈ సదస్సులో విద్యార్థులను భాగస్వాముల్ని చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సైన్స్ కాంగ్రెస్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తామన్నారు. వారినికోసారి ఈ సదస్సు నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షిస్తామన్నారు.

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షులు నారాయణ, మంత్రి గంటా శ్రీనివాస రావులు కూడా మాట్లాడారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో పదిహేను వేల మంది పాల్గొంటారన్నారు. తొమ్మిది మందికి పైగా నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు కూడా ఈ సదస్సుకు హాజరవుతారన్నారు.
సైన్స్ కాంగ్రెస్ నిర్వహణలో ఎవరి బాధ్యతలు ఏమిటో ఈ సమావేశంలో ఓ స్పష్టతనిచ్చారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలకు అనుగుణంగానే ప్లీనరీ సెషన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశాభివృద్ధిలోనే ఐటీ విజ్ఞానం అనే అంశాన్ని థీమ్గా నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సదస్సు నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాయన్నారు.












Click it and Unblock the Notifications