ఏపీలో ‘108’కు అంతరాయం.. అంబులెన్స్కు కాదు: 104కి డయల్ చేయండి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాంకేతిక కారణాలతో అత్యవసర సేవల కాల్ సెంటర్ 108 నిలిచిపోయింది. సర్వర్లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా అత్యవసర సేవల ఫోన్ నెంబర్ 108 పనిచేయడం లేదని ఆ సంస్థ అదనపు సీఈవో మధుసూదన్ రెడ్డి తెలిపారు.
ప్రజలు అంబులెన్స్ సేవల కోసం 104 నెంబర్కు సంప్రదించాలని కోరారు. సర్వర్లో ఏర్పడిన సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, శనివారం ఉదయం నుంచి ఏర్పడిన సాంకేతిక సమస్యతో 108 సేవలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి తిరిగి 108 సేవలను పునర్ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అప్పటి వరకూ అంబులెన్స్ సేవల కోసం 104కు ఫోన్ చేయాల్సిందిగా ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 108 ఫోన్ నెంబర్ పనిచేయనప్పటికీ.. 108 అంబులెన్స్ ల సేవలకు ఎలాంటి విఘాతం కలగలేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
కాగా, ఏపీలో అత్యవసర వైద్య సేవలతో పాటు పోలీసు, ఫైర్ ఎమర్జెన్సీల కోసం ప్రభుత్వం 108 ఫోన్ నెంబర్ ను కేటాయించింది. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో ఉన్న ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవల్ని 108 అందిస్తోంది.