ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల ..95 శాతం ఉత్తీర్ణత: తూ.గో ఫస్ట్..నెల్లూరు లాస్ట్..!
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణతా శాతం 94.88గా విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ప్రకటంచారు. 5400 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉండగా..నెల్లూరు చివరి స్థానంలో నిలిచింది. ఇక, జూన్ 17వ తేదీ నుండి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
టెన్త్ ఫలితాల్లో 94.88 శాతం ఉత్తీర్ణత..
ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. గత మార్చి 18వ తేదీ నుండి ఏప్రిల్ మూడో తేదీ వరకు పరీక్షలు జరిగాయి. ఏపీలో మొత్తంగా 2,839 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. 13 జిల్లాల్లో ఆరు లక్షల 21 వేల 634 మంది విద్యార్ధులు ఉండగా..వారిలో 99.5శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. సంఖ్యా పరంగా ఈ పరీక్షకు 6 లక్షల 30 వేల 82 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 6 లక్షల 19 వేల 494 రెగ్యులర్, 10,588 ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు.
94.88 శాతం రెగ్యులర్ విద్యార్థులు పాస్ అవగా.. దీనిలో బాలురు 94.68 శాతం కాగా, బాలికలు 95.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 94.88శాతం ఉత్తీర్ణత సాధించారు. 5400 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. చివరి స్థానంలో నెల్లూరు జిల్లా నిలిచింది.
జూన్ 17నుండి అడ్వాన్స్ సప్లిమెంటరీ..
పరీక్షల్లో పది కి పది జీపీఏ వచ్చిన జిల్లాల్లో తూర్పు గోదావరి ప్రధమ స్థానంలో ఎండగా, ద్వితీయ స్థానంలో కృష్ణా, తృతీయ స్థానంలో గుంటూరు ఉన్నాయి. గత నాలుగేళ్ల కాలంగా పది కి పది జీపీఏతో తూర్పు గోదావరి జిల్లానే తొలి స్థానంలో నిలుస్తూ వచ్చింది. ఇక, జూన్ 17వ తేదీ నుండి 29 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి వెల్లడించారు. జూన్ 7వ తేదీ సప్లిమెంటరీ పరీక్షల ఫీజుకు గడువుగా నిర్ణయించారు. రీకౌంటింగ్..వెరిఫికేషన్ కోసం మే30 లోగా సబ్జెక్టుకు రూ 500 చొప్పున చెల్లించాలని సంధ్యారాణి సూచించారు.