ఏపీలో కొత్తగా 1125 కరోనా కేసులు, 9 మంది మృతి: చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా, 1000కిపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 49,568 నమూనాలను పరీక్షించగా.. 1125 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 1125 కరోనా కేసులు, 9 మంది మృతి
తాజాగా నమోదైన 1125 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,31,974కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 9 మంది మృతి చెందారు.
కృష్ణా జిల్లాలో ముగ్గురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,019కి పెరిగింది.
ఏపీలో 14,412 యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1356 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,03,543కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 14,412 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,74,13,209 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 210 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 01 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 16, చిత్తూరులో 210, తూర్పుగోదావరిలో 62, గుంటూరులో 81, కడపలో 48, కృష్ణాలో 164, కర్నూలులో 01, నెల్లూరులో 184, ప్రకాశంలో 110, శ్రీకాకుళంలో 27, విశాఖపట్నంలో 54, విజయనగరంలో 07, పశ్చిమగోదావరిలో 161 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,88,029, చిత్తూరులో 2,41,006 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,618) కరోనా కేసులున్నాయి.
దేశంలోనూ భారీగా తగ్గిన కరోనా కేసులు
దేశంలోనూ కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా, 30వేల దిగువకు కొత్త కేసులు రావడం కాస్త ఊరటనిస్తోంది. మరణాలు మాత్రం 300పైనే ఉండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 14,30,891 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 25,404 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.32 కోట్లు దాటింది. సోమవారం 339 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మరణించినవారి సంఖ్య 4,43,213కు చేరింది. సోమవారం 37వలే మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.24కోట్లకు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.58గా ఉంది. ప్రస్తుతం దేశంలో 3,62,207 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 1.09 శాతంగా ఉంది. కాగా, నిన్న కేరళలో 15,058 కరోనా కేసులు నమోదు కాగా, 99 మరణాలు సంభవించాయి. కాగా, హర్యానా రాష్ట్రంలో నిన్న అత్యధికంగా 121 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. సోమవారం 78,66,950 మంది కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 75,22,38,324కు చేరింది.