ఏపీలో కొత్తగా 116 కరోనా కేసులు: జిల్లాల్లో సింగిల్ డిజిట్కు, జీరో మరణాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 41,910 నమూనాలను పరిక్షీంచగా.. 116 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,87,836కు చేరింది. ఈ మేరకు వివరాలను ఆదివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
కరోనా కారణంగా ఒక్క రోజు వ్యవధిలో ఎవరూ మరణించలేదు. కొత్తగా 127 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,79,405కు చేరింది. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7153కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1278 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,31,37,872 కరోనా నమూనాలను పరీక్షించారు.
ఏపీ జిల్లాలవారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 3, చిత్తూరులో 17, తూర్పుగోదావరిలో 9, గుంటూరులో 13, కడపలో 9, కృష్ణాలో 24, కర్నూలులో 7, నెల్లూరులో 5, ప్రకాశంలో 1, శ్రీకాకుళంలో 4, విశాఖపట్నంలో 13, పశ్చిమగోదావరిలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
మరోవైపు దేశంలోనూ కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 7,50,964 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,052 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,46,183కు చేరింది. కొత్తగా 13,965 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,04,23,125కు చేరింది. గడిచిన 24 గంటల్లో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 1,54,274కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,68,784 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, దేశంలో ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నవారి సంఖ్య 37,44,334కు చేరింది.