ఏపీలో కొత్తగా 120 కరోనా కేసులు .. వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు, జిల్లాల వారీగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసులు స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 48,973 నమూనాలను పరీక్షించగా.. 120 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,91,009కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల..
గత 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7177 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 93 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,82,763కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతుండటం గమనార్హం.
ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులు..
రాష్ట్రంలో ప్రస్తుతం 1064 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,43,56,138 కరోనా నమూనాలను పరీక్షించారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 4, చిత్తూరులో 35, తూర్పుగోదావరిలో 5, గుంటూరులో 6, కడపలో 10, కృష్ణాలో 25, కర్నూలులో 2, నెల్లూరులో 9, ప్రకాశంలో 2, శ్రీకాకుళంలో 3, విశాఖపట్నంలో 17,
విజయనగరంలో 2, పశ్చిమగోదావరిలో 0 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా హెచ్చుతగ్గులు.. వందలోపే మరణాలు
మరోవైపు దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 17,921 మంది కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,12,62,707కు చేరింది. అయితే, గత ఒక్కరోజు వ్యవధిలో 20,652 మంది కరోనా నుంచి కోలుకోవడం కొంత ఊరటనిచ్చే విషయం.
కాగా, ఇప్పటి వరకు 1,09,20,046 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 96.90 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 133 మంది మరణించారు. ఇప్పటి వరకు 1,58,063 మంది ఈ మహమ్మారితో మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,84,598 యాక్టివ్ కేసులున్నాయి.