ఆవ భూముల్లో 15 అడుగుల మేర నీరు, ఫిల్లింగ్కు ఎకరా రూ.50 లక్షలు, రైతు వీడియో లోకేశ్ ట్వీట్..
ఆవ భూముల్లో అవకతవకలే కాదు.. ఆ చోట భారీగా నీరు నిలిచింది. దీంతో భూములపై హైకోర్టులో పిటిషన్ వేసిన ఓ వ్యక్తి నీటిలో ఉండి మాట్లాడారు. ఆ భూములు పేదలకు కేటాయించు వద్దు బాబోయ్ అని మొత్తుకున్నాడు. ఆ వీడియోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఆవ భూముల స్కాంని వరద బయటపెట్టిందని ఆరోపించారు. ఇళ్లపట్టాల పేరుతో జగన్ రెడ్డి చేస్తోన్న స్కాం అని తుర్పార పట్టారు. ఈ నీటిలో తేలియాడే నీటిలో వైఎస్ఆర్ రేకుల షెడ్డులు రానున్నాయని ధ్వజమెత్తారు. ఆ వీడియోలో పిటిషన్ వేసిన రైతు ఏమన్నారో విందాం.
ఆవ భూముల్లో నాలుగున్నర అడుగుల మేర నీరు..
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎయిర్ పోర్టు సమీపంలో పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం భూమి కొనుగోలు చేసింది. ఎకరం రూ.45 లక్షల చొప్పున 587 ఎకరాలను కొనుగోలు చేసింది. భూమి కొనుగోలులో అవినీతి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపించారు. దీంతోపాటు ఇటీవల కురుస్తోన్న వర్షాలతో ఆ ప్రాంతం నీటిలో మునిగిపోయింది. దీంతో విపక్షాలు మండిపడ్డాయి. ముందే చెప్పినా వినిపించుకోలేదని ఆగ్రహాం వ్యక్తం చేశాయి. దీనిపై ఓ వ్యక్తి ఏకంగా వీడియో తీసి పోస్ట్ చేశారు.
ఎకరం రూ.40 నుంచి రూ.50 లక్షలు
జిల్లాలో గల లక్షన్నర మంది నిరుపేదలకు భూమి కేటాయించేందుకు ఆవ భూములను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే అందులో మెట్ట ప్రాంతంలో నాలుగున్నర అడుగుల మేర నీరు చేరింది. ఇక లోపలికి వెళితే 10 నుంచి 15 అడుగుల మేర నిలిచిపోయింది. ఒకవేళ భూముల్లో మట్టి నింపాలన్న భారీ వ్యయం వెచ్చించాల్సి వస్తోంది. ఎకరానికి కనీసం రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని సదరు వ్యక్తివాపోయారు. 487 ఎకరాలు నింపాలంటే ఎంత ఖర్చవుతుందో ఊహించుకోవాలని సూచించారు.
సమీపంలోని గ్రామాల పరిస్థితి ఏంటీ...
ఒకవేళ సమీపం నుంచి మట్టి తీసుకొచ్చినా.. మెట్ట ప్రాంతం పరిస్థితి ఏమిటని అడిగారు. అయ్యంచేరు, కాపవరం, మిట్టపాడు, ఇతర ప్రాంతాల్లో 25 వేల ఎకరాల భూమి పరిస్థితి ఏంటీ అని అడిగారు. పంట సాగు చేస్తోన్న ఆ రైతులు భూములు కూడా నీట మునుగుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ను నేతలు, అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని.. క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు. భూములిచ్చి పేదలను చంపొద్దని సూచించారు. పేదలకు ఎట్టి పరిస్థితుల్లో భూమి కేటాయించొద్దని.. ఆ ప్రయత్నాన్ని మానుకోవాలని కోరారు. నీటిలో దండం పెట్టి మరీ కోరారు.